సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు చిత్ర బృందం అదిరిపోయే శుభవార్త అందించింది. ఆయన కెరీర్లో కల్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా నిలిచిపోయిన 'అతడు' చిత్రాన్ని మళ్లీ థియేటర్లలోకి తీసుకువస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని సరికొత్త సూపర్ 4K టెక్నాలజీతో ఆగస్టు 9న గ్రాండ్గా రీ-రిలీజ్ చేయనున్నారు. మహేశ్ బాబు పుట్టినరోజు కూడా అదే రోజు కావడంతో అభిమానులకు ఇది డబుల్ ట్రీట్గా నిలవనుంది.ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, జయభేరి బ్యానర్ పై తెరకెక్కిన 'అతడు' అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. 2005 ఆగస్టు 10న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియన్స్ ను అలరించింది. మహేశ్ బాబు స్టైలిష్ పర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ పదునైన సంభాషణలు, కథనంతో ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే ప్రేక్షకులు అతుక్కుపోయి చూస్తుంటారు. ఇందులో మహేశ్ బాబుకు జోడీగా త్రిష నటించగా, నాజర్, సోనూ సూద్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.మణిశర్మ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్గా నిలిచాయి. టాలీవుడ్లో రీ-రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో, 'అతడు' వంటి యాక్షన్ ఎంటర్టయినర్ ను ఆధునిక 4K టెక్నాలజీతో బిగ్ స్క్రీన్పై చూసేందుకు ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రీ-రిలీజ్ థియేటర్లలో మరోసారి పాత రికార్డులను తిరగరాయడం ఖాయమని అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa