by Suryaa Desk | Mon, Jul 01, 2024, 02:56 PM
కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణం ఏడవ సచివాలయం పరిధిలో పెన్షన్ డబ్బులు మాయం అవడం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఈరోజు (సోమవారం) ఉదయం నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలవగా.. ప్రొద్దుటూరులో మాత్రం పలువురికి పెన్షన్లు అందని పరిస్థితి. అందుకు సచివాలయ కార్యదర్శి మురళీమోహన్ చెప్పిన కారణం చూస్తే పలు అనుమానాలకు తావిస్తోంది. విషయానికి వస్తే.... ఫించన్ డబ్బులను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారంటూ సచివాలయ కార్యదర్శి చెబుతున్నారు. పింఛన్ పంపిణీ చేసేందుకు వెళ్తుండగా సృహ తప్పి కింద పడిపోయానని చెప్పారు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న నాలుగు లక్షల రూపాయల పెన్షన్ డబ్బును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తనను 108 వాహనంలో ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారని అన్నారు. అయితే పింఛన్ డబ్బులు మాయం కావడంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు, మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Latest News