by Suryaa Desk | Mon, Jul 01, 2024, 07:47 PM
ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అందింది. ఏపీలో చాలా రోజుల తర్వాత నెల మొదటిరోజే ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు జమ అవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల ప్రారంభంలోనే జీతాలు అందక ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసినసంక్షేమ పథకాల కారణంగా.. తొలి రోజే ఉద్యోగులకు జీతాలు వేయలేని పరిస్థితి ఉండేది. దీనిపై ఉద్యోగ సంఘాలు కూడా అప్పట్లో నిరసన తెలిపాయి. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం హయాంలో ఏపీలో ఉద్యోగులకు నెల తొలిరోజే జీతాలు జమవుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు పడుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ నుంచి బ్యాచ్ నంబర్ల వారీగా జీతాలు పడుతున్నట్లు సమాచారం. దీనిపై ఉద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఏపీలో కొత్తగా కొలువు దీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం పాలనలో మార్పులు తీసుకువస్తుంది. గతంలో వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పింఛన్ పంపిణీ చేయగా.. ఈసారి సచివాలయ సిబ్బంది ద్వారా జులై పింఛన్లు పంపిణీ చేశారు. తొలి రోజే వందశాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. పెంచిన పింఛన్లను సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అందజేస్తున్నారు. అటు ఎమ్మెల్యేల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకూ అందరూ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు, తొలిరోజు సాయంత్రం నాలుగు గంటల వరకూ 81 శాతానికి పైగా పింఛన్ల పంపిణీ పూర్తైనట్లు సమాచారం .
ఇదిలా ఉండగానే ఉద్యోగులకు కూడా తొలి రోజే జీతాలు చెల్లించి ఏపీ ప్రభుత్వం అనుమానాలను పటాపంచలు చేసింది. ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తొలి రోజు వేతనాలు ఇవ్వటం సాధ్యం కాదనే అనుమానాలు ఉండేవి. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నెల మొదటి రోజే ఉద్యోగులకు జీతాలు విడుదల చేసి..ఆ సందేహాలను పటాపంచలు చేసింది. మరోవైపు గత నాలుగేళ్ల కాలంలో తొలి రోజే ఇలా జీతాలు విడుదల కావటం తొలిసారని ఉద్యోగ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వం తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Latest News