by Suryaa Desk | Mon, Jul 01, 2024, 07:52 PM
లద్ధాఖ్లో జరిగిన ప్రమాదంలో అమరులైన ముగ్గురు జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదంలో జవాన్లు వీరమరణం చెందడం తీవ్రంగా కలిచి వేసిందన్న వైఎస్ జగన్ .. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరువలేనివన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా చనిపోయిన జవాన్ల కుటుంబాలకు కోటి రూపాయల సాయం అందించి ఆదుకోవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
మరోవైపు లద్దాఖ్ వద్ద నదిని దాటే ప్రయత్నంలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు, వీరిలో ఏపీకి చెందిన వారే ముగ్గురు ఉన్నారు. లద్ధాఖ్లో జరిగిన ప్రమాదంలో కృష్ణాజిల్లా పెడన మండలం చేవెండ్రకు చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్కు చెందిన సుభాన్ ఖాన్లు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలన్న వైఎస్ జగన్..ఆయా నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు వీరి అంత్యక్రియల్లో పాల్గొనాలని సూచించారు.
మరోవైపు అమరులైన జవాన్ల భౌతికకాయాలు ఏపీకి చేరుకున్నాయి. గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా.. సైనికులు గౌరవ వందనం సమర్పించారు. చనిపోయిన వారిలో ముత్తుమల రామకృష్ణారెడ్డి జూనియర్ కమిషన్డ్ అధికారిగా వ్యవహరిస్తూ వీరమరణం పొందారు. అలాగే పెడనకు చెందిన సాదరబోయిన నాగరాజు సైనికుడిగా సేవలు అందిస్తూ అసువులు బాశారు. నాగరాజుకు ఐదేళ్ల కిందట వివాహం కాగా.. ఏడాది వయసున్న పాప ఉంది. నాగరాజు మృతితో ఆ కుటుంబం గుండెలు పగిలేలా రోదిస్తోంది. మరోవైపు బాపట్ల జిల్లాకు చెందిన సుభాన్ ఖాన్.. హవల్దార్గా పనిచేస్తూ వీరమరణం పొందారు.
Latest News