|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 11:05 AM
రాష్ట్రంలో కోడిగుడ్డు ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. ఉత్పత్తి తగ్గడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శనివారం నాటి ధరల ప్రకారం, హోల్సేల్ మార్కెట్లో విజయవాడలో వంద గుడ్ల ధర ఏకంగా రూ.690కి చేరింది. రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ ధరలు భారీగానే ఉన్నాయి.విశాఖపట్నంలో 100 గుడ్ల ధర రూ.660గా ఉండగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ.664గా ఉంది. అనపర్తి, తణుకుల్లో రూ.665, చిత్తూరులో రూ.663గా ధరలు పలుకుతున్నాయి. హైదరాబాద్లో రూ.656గా ఉండగా, ఒడిశాలోని బరంపురంలో రూ.690, చెన్నైలో రూ.670గా ధరలు నమోదయ్యాయి.మార్కెట్ డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేకపోవడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని నెక్ వర్గాలు వివరిస్తున్నాయి. సుమారు మూడు నెలల క్రితం గుడ్లు పెట్టే కోళ్లకు వ్యాధులు సోకడంతో వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఉత్తరాంధ్రలో రోజుకు 40-42 లక్షల నుంచి 36-38 లక్షలకు గుడ్ల ఉత్పత్తి పడిపోయింది. దీనికితోడు, ఈశాన్య, ఉత్తర భారత రాష్ట్రాలకు ఎగుమతులు పెరగడం కూడా స్థానిక మార్కెట్లో కొరతకు దారితీసిందని రైతులు చెబుతున్నారు.కొత్తగా పెంచుతున్న కోడిపిల్లలు గుడ్లు పెట్టే దశకు రావడానికి మరో నెల సమయం పడుతుందని రైతులు అంటున్నారు. అందువల్ల, జనవరి మూడో వారం తర్వాతే గుడ్ల ఉత్పత్తి పెరిగి, ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Latest News