|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 07:31 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అమరావతిలో భూమి లేని పేదలకు పింఛన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు సీఆర్డీఏ కసరత్తు జరుపుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశంలో అమరావతిలో భూమి లేని పేదలకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 4,929 మందికి పింఛన్ల పునరుద్ధరణపై త్రిసభ్య కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వీరికి నెలకు 5 వేల రూపాయలు చొప్పున పింఛన్ ఇచ్చేందుకు సీఆర్డీఏ చర్యలు ప్రారంభించింది. మరోవైపు అమరావతి రాజధానికి భూసమీకరణ చేసిన సమయంలో.. భూమి లేని పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో పింఛన్ అందించాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే భూమి లేని 4,929 మంది పేదలకు పింఛన్లు అందించేవారు.
అయితే ఆ తర్వాతి కాలంలో రాజధాని పనులు నిలిచిపోయాయి. కొంతమంది పేదలకు పింఛన్లు కూడా రద్దయ్యాయి. అయితే టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి రావటంతో వీరికి పింఛన్లు పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఇందుకోసం సీఆర్డీఏ దరఖాస్తులు స్వీకరించనుంది. అర్హులైన వారు గ్రామాల్లోని సీఆర్డీఏ కార్యాలయాల్లో పింఛన్ల కోసం దరఖాస్తులు ఇవ్వాలని సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఓ ప్రకటనలో వెల్లడించారు. గ్రామసభల సమయంలోనూ పింఛన్ల కోసం అర్జీలు సమర్పించవచ్చని సూచించారు. అమరావతి పరిధిలోని భూమి లేని పేదలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు అమరావతి రాజధాని కోసం గత టీడీపీ ప్రభుత్వం 33 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించిన సంగతి తెలిసిందే. వారికి రిటర్నబుల్ ప్లాట్లతో పాటుగా కౌలు చెల్లింపులు చేస్తోంది. అయితే భూమి లేని పేదలకు కూడా పింఛన్లు అందించాలనే ఉద్దేశంతో 2015-16 మధ్యకాలంలో.. 29 గ్రామాల్లో 21,374 భూమి లేని కుటుంబాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం గుర్తించింది. వారికి నెలకు రూ. 2,500 చొప్పున పింఛన్లు ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2024 ఫిబ్రవరిలో ఈ పింఛన్ మొత్తాన్ని పెంచారు. 2 వేల 500 రూపాయల నుంచి 5 వేల రూపాయలకు పెంచారు.
అయితే కరెంట్ బిల్లు సహా వివిధ సాంకేతిక కారణాలతో లబ్ధిదారుల సంఖ్యను కుదించారనే విమర్శలు ఉన్నాయి. అయితే 2024 ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి లేని పేదలకు ఇచ్చే పింఛన్ల కాలపరిమితిని మరో ఐదేళ్లు పెంచారు. రాజధాని గ్రామాల్లో అర్హులైన వారికి పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు చర్యలు చేపట్టారు.