|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 08:19 PM
సరిహద్దుల్లో భారత్-పాకిస్థాన్ల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరు దేశాలూ ఒకరిపై ఒకరు కారాలు మిరియాలూ నూరుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో భారత్-పాక్ ఉమ్మడి పాస్పోర్ట్ అనేది ఈ రోజుల్లో 'అసాధ్యం అనిపించవచ్చు. కానీ అది ఒకప్పుడు నిజంగానే అమలులో ఉండేదని మీకు తెలుసా...? ఇరు దేశాల మధ్య ఉమ్మడి పాస్పోర్ట్ ఉండేది. దేశ విభజన తర్వాత చాలా మందికి పాస్పోర్ట్లు లేకపోయినా కుటుంబ సభ్యులను కలవడానికి సరిహద్దు దాటాల్సి వచ్చేది. ఈ ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, రెండు దేశాల మధ్య రాకపోకలకు వీలు కల్పించే ఉమ్మడి ఇండియా-పాకిస్థాన్ పాస్పోర్ట్ను జారీ చేసేవారు. ఈ పాస్పోర్ట్లు 1960ల చివర వరకు వాడుకలో ఉండేవి.
తాజాగా, ప్రముఖ చరిత్రకారిణి డాక్టర్ నూర్ జైదీ తన ఇన్స్టాగ్రామ్లో పెట్టి పోస్ట్ వైరల్ అవుతోంది. భారత్-పాక్ ఉమ్మడి పాస్పోర్ట్ గురించి ఆమె తన పోస్ట్లో వివరించారు. ‘ఇండియా-పాకిస్థాన్ ఉమ్మడి పాస్పోర్టా? ఈ రోజుల్లో యుద్ధాలు, దాడులు, రాఫెల్స్, సింధూర్ వంటి వార్తల మధ్య ఇది అసాధ్యం అనిపిస్తుంది. కానీ ఇది నిజంగా ఉండేది!’ అని ఆమె పేర్కొన్నారు. దేశ విభజన తర్వాత చాలా మందికి పాస్పోర్ట్లు లేవని, కానీ ఇరువైపులా కుటుంబాలు ఉన్నవారికి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఈ ఉమ్మడి పాస్పోర్ట్ను ఇచ్చేవారని ఆమె తెలిపారు.
ఈ ఉమ్మడి ఇండియా-పాకిస్థాన్ పాస్పోర్ట్ ఎరుపు రంగు కవర్తో ఉండేది. అమృత్సర్కు చెందిన ‘ది పార్టిషన్ మ్యూజియం’ ఒక అరుదైన పాస్పోర్ట్ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. దీనిని 1968 అక్టోబర్ 28న పంజాబ్లోని అమృత్సర్కు చెందిన సర్దార్ షంషేర్ సింగ్ అనే వ్యక్తికి జారీ చేశారు.
‘‘1968 అక్టోబర్ 28న అమృత్సర్లో జారీ చేసిన ఈ భారత్-పాకిస్థాన్ పాస్పోర్ట్ సర్దార్ షంషేర్ సింగ్కు చెందింది. 1888 నవంబర్ 14న నన్కానా సాహిబ్ జిల్లాలోని (ప్రస్తుతం పాకిస్థాన్లో ఉంది) ఖిలా ధరం సింగ్లో జన్మించిన ఆయన, దేశ విభజన తర్వాత పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లా, ముక్త్సర్లో నివసిస్తున్న ఒక రైతు. పాక్లోని షేఖుపురాలో మొహబత్వాలా గ్రామంలో భాగమైన ఒక భూమి ఆయనకు సంక్రమించింది. ఆ ఎస్టేట్ నన్కానా సాహిబ్కు చాలా దగ్గరగా ఉండేది.. ఆయన దానిని కోట్ షంషేర్ సింగ్ అనే కొత్త గ్రామంగా మార్చారు. 1968 నవంబర్ 1 నుంచి 1968 నవంబర్ 7 వరకు పాక్లోని వివిధ మతపరమైన ప్రదేశాలను సందర్శించడానికి వీలుగా ఈ పాస్పోర్ట్ జారీ చేయబడింది’’ అని తెలిపింది.
‘‘1952 అక్టోబర్లో ఇండియా-పాకిస్తాన్ పాస్పోర్ట్, వీసా పథకం కింద ఈ ప్రత్యేక పాస్పోర్ట్ను జారీ చేసేవారు. ఇది రెండు దేశాల మధ్య ప్రయాణాన్ని నియంత్రించేది. రెండోది మిగతా దేశాలకు వెళ్లడానికి ప్రతి దేశం సాధారణ పాస్పోర్ట్గా ఉపయోగపడేది.. దేశ విభజన తర్వాత వచ్చిన శరణార్థుల ప్రవాహాన్ని నియంత్రించడానికి 1948లో నాటి ప్రభుత్వం భారతీయ పాస్పోర్ట్ను రూపొందించింది.. భారత్ తన పశ్చిమ సరిహద్దులో పాకిస్థాన్తో ఒక కొత్త పర్మిట్ వ్యవస్థను కూడా రూపొందించి అమలు చేసింది. దీనిని తర్వాత 1948 అక్టోబర్లో పాక్కు స్వీకరించింది. చివరికి ఇండియా-పాకిస్థాన్, వీసా పథకాన్ని 1967లో ఒక అంతర్జాతీయ పాస్పోర్ట్గా విలీనం చేశారు.’ అని ఫేస్బుక్లో వివరించింది.
Latest News