|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 08:20 PM
బంగ్లాదేశ్లో దైవ దూషణ ఆరోపణలతో హిందువు దీపు చంద్ర దాస్ను కొట్టి చంపిన ఘటనపై దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాస్ ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేశారనడానికి ప్రత్యక్ష ఆధారాలు లభించలేదని దర్యాప్తులో తేలింది. 25 ఏళ్ల దాస్ తాను పనిచేస్తున్న గార్మెంట్ ఫ్యాక్టరీ బయట ఇస్లాం, మహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఇస్లామిక్ ర్యాడికల్స్ మూక దాడిలో దారుణ హత్యకు గురయ్యారు. అతడి మృతదేహాన్ని జాతీయ రహదారిపైకి ఈడ్చుకొచ్చి ఓ చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టారు. ఈ భయంకరమైన ఘటనను గుంపు రికార్డ్ చేస్తూ నినాదాలు చేసింది. బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతోన్న క్రూరమైన దాడులకు తాజా ఉదంతం ఓ ఉదాహరణ.
బంగ్లాదేశ్ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ కమాండర్ ఒక వార్తాపత్రికకు మాట్లాడుతూ.. దాస్ తన ఫేస్బుక్లో మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా పోస్టులు చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. స్థానికు, ఫ్యాక్టరీలోని సహోద్యోగులు కూడా దాస్ అలాంటి వ్యాఖ్యలు చేసినట్లు చెప్పలేకపోయారని ఆయన పేర్కొన్నారు. ‘‘వ్యక్తిగతంగా అలాంటి వ్యాఖ్యలు విన్నట్లు ఎవరూ చెప్పడం లేదు.. మతానికి వ్యతిరేకంగా ఏదైనా చూశానని లేదా విన్నానని చెప్పుకునేవారు ఎవరూ దొరకలేదు’ అని ఆయన అన్నారు. విద్యార్ధి నాయకుడు ఉస్మాన్ హాడీ మరణంతో బంగ్లాదేశ్లో మళ్లీ రణరంగాన్ని తలపిస్తోంది.
స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ప్రవక్త మహమ్మద్పై దాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారనే పుకారు వ్యాపించి, ఫ్యాక్టరీ కార్మికులను రెచ్చగొట్టింది. ఫ్యాక్టరీ ఫ్లోర్ ఇంఛార్జ్ ఆలంగిర్ హొస్సేన్ మాట్లాడుతూ.. ‘‘దాస్ను తొలగించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ బయట గుంపు చేరింది. పరిస్థితిని అదుపు చేయడానికి దాస్ను విధుల్లోంచి తొలగించాం. మేము అతడ్ని రక్షించడానికి ప్రయత్నించాం.. కానీ పరిస్థితి అదుపుతప్పింది. అప్పుడు గుంపు అతడ్ని కొట్టి చంపింది’’ అని తెలిపారు. గుంపు చుట్టుముట్టి, పరిస్థితి అదుపుతప్పడంతో ఫ్యాక్టరీని రక్షించడానికి దాస్ను బయటకు పంపారని అధికారులు పేర్కొన్నారు.
మొదట కర్రలు, స్థానికంగా దొరికిన ఇతర ఆయుధాలతో అతడ్ని కొట్టి చంపింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఢాకా-మైమెన్సింగ్ హైవే మధ్యలో ఉన్న చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ అమానవీయ దృశ్యాలు తీవ్ర కలకలం రేపాయి. దాస్ దారుణ హత్యకు సంబంధించి పది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం.. నేరస్థులను వదిలిపెట్టబోమని స్పష్టం చేసింది. "మైమెన్సింగ్లో ఒక హిందూ వ్యక్తిని కొట్టిచంపడాన్ని మేము ఖండిస్తున్నాం... కొత్త బంగ్లాదేశ్లో ఇలాంటి హింసకు చోటు లేదు. ఈ ఘోరమైన నేరానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోం’ అని యూనస్ కార్యాలయం తెలిపింది.
Latest News