|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 08:56 PM
భారత వైమానిక దళం కోసం భారత రక్షణ పరిశోధన సంస్థ ( డీఆర్డీఓ ).. అత్యంత శక్తివంతమైన, స్మార్ట్ నెక్స్ట్ జనరేషన్ క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి చేస్తోంది. ఇప్పటివరకు భారత్ తయారు చేసిన అత్యంత శక్తివంతమైన మిసైల్ సిస్టమ్లలో ఒకటైన బ్రహ్మోస్ కంటే ప్రమాదకరమైన.. అగ్ని-5 కంటే మరింత స్మార్ట్ అయిన తర్వాతి తరం క్షిపణి తయారీని వేగవంతం చేస్తోంది. భారత్ తయారు చేసిన క్షిపణులు అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను చేధిస్తుండగా.. ఈ సరికొత్త మిసైల్ లక్ష్యాలను కచ్చితంగా చేధించడంతోపాటు.. దాడి చేసే ముందు దాన్ని వెరిఫై చేసుకునే టెక్నాలజీని కూడా కలిగి ఉండటం విశేషం.
ఈ క్షిపణి ప్రత్యేకతలేమిటి?
సాధారణ క్రూయిజ్ క్షిపణులు ప్రయోగించిన తర్వాత నేరుగా వెళ్లి లక్ష్యాన్ని ఢీకొంటాయి. కానీ ఈ కొత్త తరం క్షిపణిలో 'మ్యాన్-ఇన్-ది-లూప్' అనే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ క్షిపణిని ప్రయోగించిన తర్వాత.. లక్ష్యం ఉన్న ప్రాంతంలో కొంతసేపు గాలిలోనే ఉండి (లోయిటరింగ్ సామర్థ్యం).. లైవ్ డేటాను యుద్ధ విమానంలోని అధికారులకు పంపిస్తుంది. అప్పుడు ఆ లక్ష్యాన్ని అధికారులు స్పష్టంగా చూసి.. అది సరైందే అని నిర్ధారించుకున్న తర్వాతే దాడికి ఆదేశిస్తారు.
ఈ టెక్నాలజీ వల్ల పొరపాటున పౌరులకు లేదా అనవసర ఆస్తులకు జరిగే నష్టాన్ని పూర్తిగా తగ్గించవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మిసైల్ సిస్టమ్ భూమిపై ఉన్న స్థావరాలను, సముద్రంలోని యుద్ధనౌకలను కూడా ధ్వంసం చేసే శక్తిని కలిగి ఉంటుంది. బ్రహ్మోస్ క్షిపణి తన వేగానికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అయితే ఈ కొత్త క్షిపణి వేగం కంటే.. నిర్ణయాధికారంలో మరింత సమర్థవంతంగా ఉంటుంది. బ్రహ్మోస్ లేదా అగ్ని క్షిపణులు ప్రయోగించాక వాటిని వెనక్కి తీసుకోవడం, లక్ష్యాన్ని మార్చడం దాదాపు అసాధ్యమైన పని. కానీ ఈ కొత్త క్షిపణి మాత్రం లక్ష్యాన్ని సరిగ్గా నిర్ధారణ చేయకపోతే దాడి చేయదు. అంటే ఇది ఒక స్మార్ట్ క్షిపణిలా వ్యవహరిస్తుంది.
ఈ క్షిపణి సుమారు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అదే సమయంలో 50 కిలోల బరువు ఉన్న శక్తివంతమైన పేలుడు పదార్థాలను కూడా మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీన్ని మిషన్ అవసరాన్ని బట్టి వివిధ రకాల సెన్సార్లతో మార్చుకునేలా మోడ్యులర్ డిజైన్తో తయారు చేస్తున్నారు. నావిగేషన్ కోసం జీపీఎస్, ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ కలయికను వాడుతున్నారు. దీనివల్ల శత్రువుల రాడార్లు, యుద్ధనౌకలు, మొబైల్ ఆస్తులను అత్యంత కచ్చితత్వంతో దెబ్బతీయవచ్చు.
ఈ ప్రాజెక్టు విజయవంతమైతే.. ఇండియన్ ఎయిర్ఫోర్స్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రెసిషన్ స్ట్రైక్ సామర్థ్యాన్ని పొందుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఏఎంసీఏ) వంటి ఫిఫ్త్ జనరేషన్, సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్లలో ఈ క్షిపణులను అమర్చే అవకాశాలు ఉన్నాయి. ఆధునిక యుద్ధ తంత్రంలో కేవలం బలం మాత్రమే కాకుండా.. కంట్రోల కూడా చాలా ముఖ్యమని ఈ క్షిపణి నిరూపిస్తోంది. ఇది భారత రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో గొప్ప అడుగు అని విశ్లేషకులు చెబుతున్నారు.