|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 12:09 PM
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ప్రవాహం పెరిగిందంటూ నారా లోకేష్ ఎక్స్ (X) వేదికగా చేసిన పోస్టుకు మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ సమాధానం ఇచ్చారు. ఫోర్బ్స్ కథనాన్ని ఉదహరిస్తూ, ఏపీకి చూపించిన వాస్తవ పెట్టుబడుల ఆధారంగా కాదని, కేవలం పెట్టుబడి ప్రకటనలు, ప్రతిపాదనలు ఆధారంగానే ఉందని స్పష్టం చేశారు. అవి అమలవుతాయో లేదో పూర్తిగా అనిశ్చితమని వ్యాఖ్యానించారు. 2019–24 కాలంలో దక్షిణ భారతదేశంలో తయారీ రంగ జివిఎ వృద్ధిలోను, మొత్తం పరిశ్రమల రంగ జివిఎ వృద్ధిలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇది పూర్తిగా వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన స్థిరమైన విధానాల ఫలితమని ఆయన పేర్కొన్నారు.టీడీపీ ఏళ్ల తరబడి “బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ నాశనం అయింది” అంటూ చేసిన ప్రచారం అబద్ధమని ఈ వాస్తవ గణాంకాలు స్పష్టంగా రుజువు చేస్తున్నాయని విమర్శించారు. టీడీపీకి హడావుడి ప్రచారం, ప్రకటనలే ముఖ్యం అయితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం వాస్తవ అభివృద్ధి, నిజమైన వృద్ధి, ప్రజలకు మెరుగైన ఫలితాలే లక్ష్యంగా పనిచేసిందని చెప్పారు.ప్రభుత్వం క్రెడిట్ కోసం కాదు, ఫలితాల కోసం పనిచేసినప్పుడే రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందన్నారు. వాస్తవ గణాంకాలే తమ పాలనకు సాక్ష్యమని, ప్రజలు నిజాన్ని గమనిస్తున్నారని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.
Latest News