|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 08:10 PM
అనంతపురం జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం సందర్భంగా.. అనంతపురం జెడ్పీ కార్యాలయంలో కొంతసేపు గందరగోళ వాతావరణం ఏర్పడింది. టీడీపీ నేతకు, అనంతపురం టూ టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది, సర్వసభ్య సమావేశం కావటంతో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి కూడా సమావేశానికి వచ్చారు.
అయితే ఆయనతో పాటుగా వచ్చిన మైసూరారెడ్డి అనే టీడీపీ నేత.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జెడ్పీ సమావేశం కావటంతో అనధికారిక వ్యక్తులు బయటకు వెళ్లాలని సీఐ శ్రీకాంత్ యాదవ్ సూచించారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత మైసూరా రెడ్డికి.. సీఐకు వాగ్వాదం జరిగింది. నన్నే బయటకు వెళ్లమంటావా అంటూ మైసూరారెడ్డి సీరియస్ కావటంతో.. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది.
దీంతో ఏయ్ అంటూ ఒకరిపై ఒకరు తోసుకునే వరకూ వెళ్లారు. ఇదే సమయంలో మిగతా పోలీసులు కూడా సీఐ శ్రీకాంత్ యాదవ్కు మద్దతుగా రావటంతో.. ఉద్రిక్తతలు తలెత్తాయి. అయితే ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం మైసూరారెడ్డిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే ప్రజాప్రతినిధుల వెంట వచ్చిన వారికి ఈ అత్యుత్సాహం ఏమిటనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజనం కూడా భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.
మరోవైపు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సందర్బంగా ఆ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలును సమీక్షిస్తూ ఉంటారు. ఇందుకోసం జెడ్పీటీసీ సభ్యులతో పాటుగా ఆ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటూ ఉంటారు. ఈ సమావేశంలోనే పెండింగ్ బిల్లులతో పాటుగా వివిధ సమస్యలపైనా, వాటి పరిష్కార మార్గాలపైనా చర్చిస్తూ ఉంటారు.
అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించటంతో పాటుగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి క్షేత్రస్థాయిలో అర్హులకు సక్రమంగా అందుతోందా లేదా వంటి విషయాలపై చర్చిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇలాంటి సమావేశానికి అనధికారిక వ్యక్తులు ఎందుకని నెటిజనం ప్రశ్నిస్తున్నారు.
Latest News