గంగా ఘాట్‌లలోకి హిందూయేతరులకు నో ఎంట్రీ..!
 

by Suryaa Desk | Tue, Jan 06, 2026, 09:58 PM

హరిద్వార్‌లోని 105 ఘాట్‌లలోకి హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రతిపాదనకు కొందరు మఠాధిపతులు, హరి-కి-పౌరి ఘాట్ నిర్వహణ బాధ్యతలు చూసే గంగా సభ మద్దతు తెలిపాయి. అంతేకాకుండా, రిషికేశ్, హరిద్వార్‌లను ‘సనాతన పవిత్ర నగర్’లుగా ప్రకటించాలని కూడా పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం భావిస్తోంది. 2027 జనవరి 14న మకర సంక్రాంతికి ప్రారంభం కానున్న అర్ధ కుంభ్ మేళా నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.


ఈ విషయంలో 1916లో భారతరత్న పండిట్ మదన్ మోహన్ మాలవ్యా, బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం వివరాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. గంగా సభకు తొలి అధ్యక్షుడిగా మాలవ్యా వ్యవహరించారు. ఆ ఒప్పందం ప్రకారం.. గంగా నది ప్రవాహాన్ని నిరంతరాయంగా కొనసాగించడం, పుణ్యనగరం పవిత్రతను కాపాడటం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా గంగా ఘాట్‌లలోకి హిందూయేతరుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. అంతేకాదు, రిషికేశ్, హరిద్వార్‌లలో హిందువులు కానివారు శాశ్వతంగా నివసించడానికి వీలులేదు. వారు కేవలం పని నిమిత్తం వచ్చి, తమ పనులు పూర్తయ్యాక తిరిగి వెళ్లిపోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ అసలు ఒప్పందంలోని నిబంధనలను పునరుద్ధరించాలని తీవ్రంగా పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ మాట్లాడుతూ.. ‘‘దేవభూమి ప్రత్యేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక గుర్తింపును కాపాడటానికి మా ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ఈ హిమాలయ రాష్ట్రం సనాతన విశ్వాసులకు విశ్వాస కేంద్రం. హరిద్వార్, రిషికేశ్ ప్రధాన విశ్వాస కేంద్రాలు. ఈ రెండు ప్రాంతాలను 'సనాతన నగరాలు'గా ప్రకటించే విషయం పరిశీలనలో ఉంది’’ అని తెలిపారు.


గంగా సభ అధ్యక్షుడు నితిన్ గౌతమ్ గతంలో మాట్లాడుతూ.. ‘హరిద్వార్ పవిత్రతను కాపాడటానికి, మొత్తం కుంభ్ మేళా, హరిద్వార్ నగరాన్ని హిందువులు కానివారికి నిషేధిత ప్రాంతంగా ప్రకటించాలి. వారి ప్రవేశాన్ని నిషేధించాలి. హరిద్వార్, రిషికేశ్‌లలోని అన్ని నదీ తీరాలు వారికి ప్రవేశం ఉండకూడదు’ అని అన్నారు. అయితే తాను విశ్వ హిందూ పరిషత్ (హరిద్వార్) మాజీ అధ్యక్షుడిగా ఆ డిమాండ్ చేశానని, గంగా సభలో దీనిపై ఎలాంటి తీర్మానం చేయలేదని టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు.


గంగా సభ ప్రధాన కార్యదర్శి తన్మయ్ వశిష్ఠ్ ఈ సున్నితమైన విషయంపై స్పందించలేదు. అయితే, మాజీ అధ్యక్షుడు అశోక్ త్రిపాఠి మాట్లాడుతూ..‘ఈ డిమాండ్‌కు నేను మద్దతు ఇవ్వడం లేదు. హరిద్వార్ నగర పాలిక నిబంధనల ప్రకారం, ప్రభుత్వ విధుల్లో ఉన్నవారిని మినహాయించి, హిందూయేతరుల ప్రవేశం హరి-కి-పౌరి ప్రాంతంలో నిషేధం.. కానీ వ్యక్తిగతంగా, నేను అలాంటి నిషేధానికి మద్దతు ఇవ్వను’ అని చెప్పారు.


హరిద్వార్ నివాసితులు మాత్రం ఈ డిమాండ్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ‘మొత్తం కుంభ్ ప్రాంతంలోకి హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించడం సాధ్యం కాదు, కోరడం కూడా సరికాదు’ అని న్యాయవాది సుధాన్షు ద్వివేది అన్నారు. ‘ఇలాంటి వివక్ష మన మతం ఉదారవాద ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’ అని రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాకేష్ చంద్ర అన్నారు.


రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంసై స్పందించాయి. కాంగ్రెస్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అశోక్ శర్మ మాట్లాడుతూ.. ‘‘హిందూయేతరుల ప్రవేశం నిషేధాన్ని హరి-కి-పౌరి మాత్రమే పరిమితం చేయాలని కోరిన మదన్ మోహన్ మాలవ్యా కంటే బీజేపీ-ఆర్ఎస్ఎస్ పెద్ద హిందువులా? ఈ నిషేధాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం’’ అని అన్నారు. హరిద్వార్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందీప్ గోయల్ మాట్లాడుతూ.. ‘ఇది మా పార్టీ విధానం కాదు...’ అని తెలిపారు.

Latest News
No better place than a full crowd of blue: Daryl Mitchell on NZ youngsters’ first cricket experience of India Sun, Jan 11, 2026, 06:30 PM
Amit Shah calls for BJP CM in Kerala, pushes big leap for party Sun, Jan 11, 2026, 06:27 PM
People of Punjab must reject politics of lies, says Haryana CM Sun, Jan 11, 2026, 06:25 PM
Pakistani police arrest Afghan journalist in Islamabad Sun, Jan 11, 2026, 05:31 PM
Pakistan needs to give fair taxation rights to states Sun, Jan 11, 2026, 05:30 PM