|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 07:40 PM
విశాఖపట్నం రైల్వేస్టేషన్లో భారీగా నకిలీ కరెన్సీ నోట్లు పట్టుబడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. పోలీసుల సాధారణ తనిఖీలలో ఇద్దరు యువకుల వద్ద 3.32 లక్షల విలువైన దొంగనోట్లు దొరకడం సంచలనం రేపింది. దీంతో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు కథ వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఇటీవల ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా సాధారణ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నకిలీ నోట్లతో ఉన్న ఇద్దరు యువకులను పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.3.32 లక్షల విలువైన 200 రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మార్కాపురానికి చెందిన సునీల్ కుమార్, కడప జిల్లాకు చెందిన నితీశ్ కుమార్గా గుర్తించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు వ్యవహారం వెలుగుచూసింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితులకు హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఆ వ్యక్తితో వీరిద్దరూ నకిలీ నోట్ల కోసం ఒప్పందం చేసుకున్నారు. 50 వేల రూపాయల అసలైన నోట్లను.. ఒకటిన్నర లక్ష దొంగనోట్లు ఇచ్చేలా వీరి మధ్య ఒప్పందం జరిగింది. సంక్రాంతి సీజన్ కావటంతో కోడిపందేలను టార్గెట్ చేసుకున్న ఇద్దరు యువకులు అత్యాశతో ఈ ఒప్పందం చేసుకున్నారు. కోడిపందేలు జరిగే బరుల వద్ద ఈ నకిలీ నోట్లను మార్చి సొమ్ము చేసుకోవాలని భావించారు. అయితే వీరు వేసుకున్న ప్లాన్ బెడిసికొట్టింది. కోడిపందేల వద్ద నకిలీ నోట్లు చెలామణికి ప్రయత్నించగా కుదరలేదు.
దీంతో చేసేదేమీలేక విశాఖపట్నంలో ఓ వ్యక్తికి నకిలీ నోట్లు ఇచ్చేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్లో పోలీసులు జరిపిన తనిఖీలలో అడ్డంగా దొరికిపోయారు. నిందితులపై కేసు నమోదుచేసిన పోలీసులు.. వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రైళ్లల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. స్మగ్లింగ్, గంజాయి రవాణా వంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు.