|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 09:20 PM
దాయాది దేశం పాకిస్తాన్ లో సంచలన సంఘటన చోటు చేసుకుంది. వివాహ వేడుకలో చోటు చేసుకున్న ఆత్మాహుతి బాంబు దాడి దేశంలో తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో పది మంది మృతి చెందగా, మరో 25 మంది గాయపడ్డారు. ఈ దారుణం పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో శుక్రవారం నాడు చోటు చేసుకుంది. అయితే బాధితులు నిషేధిత తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) హిట్ లిస్ట్లో ఉన్నవారని సమాచారం. దీంతో పాకిస్తాన్లోని పలు ముఖ్య ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.
స్థానిక పోలీసుల కథనం ప్రకారం, ఈ దాడి దెరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో జరిగింది. ప్రభుత్వానికి మద్దతిచ్చే కమ్యూనిటీ నాయకుడు నూర్ ఆలం మెహసూద్ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతోంది. ఆ సమయంలోనే ఒక ఆత్మాహుతి బాంబర్ తన ఒంటిపై ఉన్న బాంబును పేల్చుకున్నాడు. ఈ పేలుడుతో పెళ్లి వేడుకలో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అతిథులు డాన్స్ చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. శక్తివంతమైన పేలుడు కారణంగా ఇంటి పైకప్పు కూలిపోయింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడం కష్టమైంది. మరణించిన వారిలో ఒక 'గుడ్ తాలిబ్' కూడా ఉన్నాడని అధికారులు తెలిపారు. 'గుడ్ తాలిబ్' అంటే ప్రభుత్వానికి లొంగిపోయిన మాజీ మిలిటెంట్ అని అర్థం. మరణించిన మిగతా వారంతా అతని బంధువులే.
గాయపడిన వారిని, మరణించిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ దాడిలో ఎవరైనా సహకరించారా అని తెలుసుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నామని ఏ గ్రూపు కూడా వెంటనే ప్రకటించుకోలేదు. అయితే ఈ దాడి వెనుక తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) ఉండవచ్చని అనుమానిస్తున్నారు. గతంలో కూడా ఈ గ్రూపు పాకిస్తాన్లో అనేక దాడులకు పాల్పడింది.
ఖైబర్ పఖ్తుంఖ్వా రెస్క్యూ ప్రతినిధి మాట్లాడుతూ.. ఆత్మాహుతి దాడిలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాము అని తెలిపారు. దాడి గురించి తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో బాధితులంతా టీటీపీ హిట్ లిస్ట్లో ఉన్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Latest News