|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 10:03 PM
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పర్యటన నేపథ్యంలో సామాన్య ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బిహార్ మాజీ సీఎం, భారతరత్న కర్పూరీ ఠాకూర్ 102వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్ కోసం రైల్వే గేటును గంటసేపు మూసివేయకుండా ఉంచడంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. శనివారం సమస్తీపూర్ జిల్లాలోని కర్పూరీ గ్రామంలో జరిగిన కర్పూరీ ఠాకూర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాల్గొన్నారు.
సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్ ఎక్కడా ఆగకుండా కర్పూరీ గ్రామానికి వెళ్లాలని సమస్తీపూర్ జిల్లా యంత్రాంగం రైల్వే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల కర్పూరీ గ్రామ్ స్టేషన్ సమీపంలోని రైల్వే క్రాసింగ్ (గుమ్తీ)ని ఉదయం 10.19 గంటల నుంచి దాదాపు 37 నిమిషాల పాటు తెరిచే ఉంచారు. ఈ నిర్ణయం వల్ల సమస్తీపూర్-ముజఫర్పూర్ రైల్వే సెక్షన్లో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఇలా గేటు తెరిచి ఉంచడంతో.. వైశాలి ఎక్స్ప్రెస్ రైలు.. సమస్తీపూర్ స్టేషన్లో ఉదయం 10.21 గంటల నుంచి 11.19 గంటల వరకు సుమారు గంటపాటు నిలిచిపోయింది. టాటా-ఛప్రా ఎక్స్ప్రెస్ ఒక 1.07 గంటల పాటు ఆలస్యంగా నడిచింది. షహీద్ ఎక్స్ప్రెస్ రైలును సుమారు 25 నిమిషాల పాటు నిలిపివేశారు. బరౌనీ-గోండియా ఎక్స్ప్రెస్ రైలుతో పాటు మరికొన్ని రైళ్లు ప్లాట్ఫారమ్లు ఖాళీ లేక స్టేషన్ కంటే ముందే రైల్వే అధికారులు ఆపేశారు.
అధికారుల అత్యుత్సాహం
సీఎం నితీష్ కుమార్ హెలికాప్టర్ దిగినట్లు సమాచారం అందగానే.. పోలీసులు రైల్వే గేటు వద్ద భారీగా మోహరించారు. కర్పూరీ ఠాకూర్ విగ్రహానికి నితీష్ కుమార్ నివాళులర్పించి సీఎం కాన్వాయ్ తిరిగి వెళ్లేవరకు రైల్వే గేటు వేయవద్దని డీఎస్పీ పదే పదే రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చివరికి 10.56 గంటల ప్రాంతంలో సీఎం కాన్వాయ్ వెళ్లిపోయిన తర్వాతే రైల్వే గేటు మూసివేయడంతో.. తిరిగి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. అప్పటివరకు దాదాపు గంటకు పైగా రైళ్లలో ఉన్న ప్రయాణికులు.. అవస్థలు పడ్డారు.
ఈ రైల్వే గేటు ఓపెన్ చేసిన విషయం కాస్తా.. మీడియా, సోషల్ మీడియాల్లో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీఐపీ కల్చర్ను పెంచడం వల్ల సామాన్యులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని మండిపడుతున్నారు.
Latest News