|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 04:08 PM
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి గళమెత్తింది. రైల్వేకోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్పై తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయనను వెంటనే అరెస్ట్ చేసి బాధితురాలికి న్యాయం చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి టోల్గేట్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన తెలియజేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి భద్రత, గౌరవం లేకుండా పోయిందని తీవ్రంగా విమర్శించారు.స్వయాన ప్రజాప్రతినిధులే మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులకు పాల్పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగినైన బాధితురాలు, గత ఒకటిన్నర సంవత్సరాలుగా తనపై ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వేధింపులకు పాల్పడుతున్నాడని ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఈ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ “సామాన్యుడైనా, ప్రజాప్రతినిధైనా చట్టం ముందు అందరూ సమానమే” అంటూ గొప్ప మాటలు చెప్పారని గుర్తు చేశారు. కానీ నేడు మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ముఖం చాటేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో అసలు హోం మంత్రి ఉన్నారా? లేక కళ్లకు గంతలు కట్టుకున్నారా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా బాధితురాలు నారావారిపల్లికి వెళ్లి సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వినతిపత్రంగా అందించినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరమని తెలిపారు. ఇది మహిళల పట్ల కూటమి ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు.తక్షణమే ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ను అరెస్ట్ చేసి బాధితురాలికి న్యాయం చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధమవుతామని కొరముట్ల శ్రీనివాసులు స్పష్టం చేశారు.
Latest News