|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 04:13 PM
తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ కోర్టుకు సమర్పించిన ఛార్జి షీట్ లో నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదన్న వాస్తవం తేటతెల్లమైందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ... ఈ ఛార్జి షీట్ సాక్షిగా తిరుమల లడ్డూపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల దుష్ప్రచారం బట్టబయలైందన్నారు. తొలుత నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కల్తీ జరిగిందని ఈవో శ్యామలరావు చెబితే... కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఏకంగా జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు ఆరోపణ చేయడంతో పాటు ఈవో తో కూడా మరలా తప్పుడు ప్రకటన చేయించారని మండిపడ్డారు. మరోవైపు అయోధ్యకి పంపిన లక్ష లడ్డూలు కల్తీ నెయ్యితో తయారుచేసినవి చెప్పడం ద్వారా.... డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం దేవదేవుడి ప్రతిష్ఠను దిగజార్చి, కోట్లాది మంది హిందువుల మనోభావాలు కలుషితం చేశారని మండిపడ్డారు. అసలు జంతు కొవ్వే లేదన్న సీబీఐ నివేదికతో కూటమి కుట్ర బయటపడిందని తేల్చి చెప్పారు. మరోవైపు ఈ వ్యవహారంలో రాజకీయపరమైన నేరం లేదని తేలిందన్న భూమన.. సిట్ ఛార్జి షీట్ లో టీటీడీ అధికారులు, సాంకేతిక నిపుణులు కుమ్మక్కయ్యారని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వాస్తవానికి 2013 నుంచే ప్రీమియర్ డెయిరీ, బోలేబాబా నెయ్యి సరఫరా చేస్తున్నాయని.. ఈ నేపధ్యంలో 2014-19 మధ్య నెయ్యి సరఫరాపై విచారణకు చంద్రబాబు సిద్ధమా అని ప్రశ్నించారు. దమ్ముంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్ చేశారు. వైయస్.జగన్ హాయంలో నెయ్యి నాణ్యత పరీక్షకు ఎన్ డి డీ బీతో ఒప్పందం చేసుకుని అత్యాధునిక పరిజ్ఞానాన్ని తెచ్చామన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశ్యంతోనే యజ్ఞాన్ని అపవిత్రం చేసే రాక్షసుల్లా చంద్రబాబు, పవన్ వ్యవహరించారని.. సీబీఐ నివేదికతో వీరి బాగోతం భయట పడిందన్నారు. బాబు దైవభక్తి ఓ నాటకమని, అధికారమే ఆయనకు కీలకమన్న భూమన వైయస్.జగన్ ని దెబ్బతీయడానికి జగన్నాధుడిపైనే విషం కక్కారని మండిపడ్డారు. పదవి కోసం పాతాళం కన్నా దిగజారిన వీరు పాపపరిహారం చేసుకోవాల్సిందేనన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వరకూ శుద్ధి చేయాలని, చంద్రబాబు గుండు చేయించుకుని, శ్రీ వెంకటేశ్వస్వామికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Latest News