|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 02:55 PM
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమీక్షా సమావేశం జరిగింది. గత 19 నెలల ప్రభుత్వ పాలన, పథకాల అమలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గడిచిన 19 నెలల్లో రాష్ట్రాన్ని అగాధం, అంధకారం నుంచి బయటపడేశామని, కుప్పకూలిన వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టగలిగామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే తొలి ప్రాధాన్యమని ఆయన పునరుద్ఘాటించారు.ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు. 'తల్లికి వందనం' ద్వారా తల్లుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.10 వేల కోట్లు జమ చేశామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న 'స్త్రీశక్తి' పథకం ద్వారా రాష్ట్రంలో మహిళల మొబిలిటీ పెరిగిందని, ఇప్పటివరకు 4.29 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని వివరించారు. దీనివల్ల ప్రస్తుతం ఉన్న బస్సుల ఆక్యుపెన్సీ కూడా గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. 'అన్నదాత సుఖీభవ' పథకం కింద రైతులకు రూ. 6,310 కోట్ల ఆర్థిక సహకారం అందించామని తెలిపారు. వీటితో పాటు 'దీపం 2.0' ద్వారా 2 కోట్ల గ్యాస్ సిలెండర్లు, 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల ద్వారా రూ.58 వేల కోట్ల ఆర్థిక చేయూత అందించినట్లు వెల్లడించారు.
Latest News