|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 02:57 PM
అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ మరోసారి తీవ్ర కలకలం సృష్టిస్తోంది. సదుం మండలంలోని మూడు గ్రామాల్లో వేలాది కోళ్లు అంతుచిక్కని రీతిలో మరణించడం స్థానికంగా ఆందోళనకు దారితీసింది. అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు 24 వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ పరిణామంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టింది.వివరాల్లోకి వెళితే.. సదుం మండలంలోని పుట్టవాండ్లపల్లె, కంభంవారిపల్లె, అమ్మగారిపల్లె గ్రామాల్లోని కోళ్ల ఫారాల్లో గత కొన్ని రోజులుగా కోళ్లు భారీ సంఖ్యలో చనిపోతున్నాయి. దీంతో అనుమానం వచ్చిన పశుసంవర్ధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మరణించిన కోళ్ల నుంచి నమూనాలను సేకరించి మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్కు పరీక్షల నిమిత్తం పంపించారు. ఈ పరీక్షల్లో బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అమ్మగారిపల్లె, పుట్టవారిపల్లె గ్రామాల్లో కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూనే కారణమని స్పష్టమైందని, కంభంవారిపల్లె నివేదిక రావాల్సి ఉందని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ పిళ్లై వెల్లడించారు.ఈ పరిణామాలపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Latest News