|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 07:51 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు పౌరసేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా పాలనాపరంగా పలు సంస్కరణలు తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే పాలనలో టెక్నాలజీ వినియోగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు అందించిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు మరో స్మార్ట్ ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలోని కోటీ 40 లక్షల కుటుంబాలకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు అందించాలని ఆలోచన చేస్తోంది. ఫ్యామిలీ కార్డు బెనిఫిట్ సిస్టమ్ ద్వారా వచ్చే జూన్ కల్లా రాష్ట్రంలోని కుటుంబాలకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు పంపిణీ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
సంజీవని ప్రాజెక్టు, జనాభా నిర్వహణ, పౌష్టికాహారం వంటి అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సంజీవని ప్రాజెక్టు కింద జులై నాటికి రాష్ట్రంలోని 66 లక్షల హైరిస్క్ కేసులకు హెల్త్ స్క్రీనింగ్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలోనే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుల గురించి చంద్రబాబు చర్చించారు. జూన్ నాటికి రాష్ట్రంలోని కుటుంబాలకు వీటిని పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు వచ్చే సంవత్సరానికి ఏపీని ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు.
మరోవైపు ఈ ఏడాది జూన్లోగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు పంపిణీ చేయనుంది. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద ఈ కార్డులను అందిస్తారు. ప్రతీ కుటుంబాన్ని ఓ యూనిట్ కింద పరిగణిస్తారు. స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల మీద ప్రత్యేకంగా ఓ క్యూఆర్ కోడ్ ముద్రిస్తారు. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆ కుటుంబం సమాచారం, వారికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలు, పీ4 అంశాలు వంటివి తెలిసేలా ఈ కార్డులను డిజైన్ చేయనున్నారు.
అలాగే ఈ కార్డుల సాయంతో రేషన్ కార్డు సేవలు, ఉపకార వేతనాలు, కులధ్రువీకరణ పత్రాలు, పింఛన్ల వివరాలు, వ్యాక్సినేషన్ వంటి వివరాలను ట్రాక్ చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. స్మార్ట్ ఫ్యామిలీ కార్డులలో కుటుంబం మొత్తం వివరాలు ఉండటంతో.. సంక్షేమ పథకాల అమలు సమయంలో అర్హులకు లబ్ధి చేకూరనుంది. అలాగే పౌరసేవలు వేగంగా అందుబాటులోకి వస్తాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే కుటుంబం మొత్తం సమాచారం ఉండటంతో పత్రాలను మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.
Latest News