స్టైలిష్ దొంగగా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
 

by Suryaa Desk | Mon, Feb 09, 2026, 07:56 PM

అతనో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. హైదరాబాద్‍‌లోని ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం కూడా చేశాడు.. ఉన్నత చదువులు చదివాడు.. ఉన్నత ఉద్యోగంలో ఉన్నాడు.. కానీ బుద్ధి మారలేదు. విలాసాలకు అలవాటు పడిన జీవితం.. మనసును కుదురుగా ఉండనివ్వలేదు. కట్ చేస్తే.. ఏపీలోనే పేరు మోసిన దొంగగా మారాడు. కొట్టేసిన సొమ్ముతో జల్సాలు చేస్తూ స్టైలిష్ దొంగగా పేరు తెచ్చుకున్నాడు. అతని పేరే అచ్చి మహేష్ రెడ్డి .. అలియాస్ సన్నీ.. విశాఖలో జరిగిన ఓ దొంగతనం కేసును దర్యాప్తు జరిపిన పోలీసులు దొంగగా మారిన ఈ మాజీ టెకీని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..


గాజువాక పోలీసులు గత శనివారం (ఫిబ్రవరి 9) ఓ మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నంలో 26 ఇళ్లల్లో చోరీలకు సంబంధించిన కేసులో అచ్చి మహేష్ రెడ్డి అనే మాజీ సాఫ్ట్‌‍వేర్ ఉద్యోగిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 700 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.8 కేజీల వెండి, బీఎండబ్ల్యూ కారు, ఓ స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లల్లో చోరీల కోసం ఉపయోగించే పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ బీఎండబ్ల్యూ కారు, స్కూటర్‌ను చోరీ చేసిన సొమ్ముతో కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.


అచ్చి మహేష్ రెడ్డి.. విశాఖలోని మాధవధార ప్రాంతంలోని పార్క్ స్ట్రీట్‌లో ఉంటున్నారు. ఇతని స్వస్థలం కాకినాడ జిల్లా. అయితే విశాఖపట్నంలోని పలు ప్రాంతాలలో ఈ మధ్యకాలంలో వరుస చోరీలు జరిగాయి. వరుసగా ఇళ్లల్లో దొంగతనాలు జరుగుతూ వచ్చాయి. రూ. 25 లక్షలకు పైగా విలువైన బంగారం, వెండి, నగదు చోరీకి గురైంది. దీంతో పోలీసులు నిఘాను పెంచారు. ఈ క్రమంలోనే పోలీసులకు పక్కా ఆధారం లభించింది. దీంతో నిందితుడు మహేష్ రెడ్డిని పట్టుకున్నారు.


మహేష్ రెడ్డి ఉన్నత చదువులు చదువుకుని, హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేశారు. అయితే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన సన్నీ దొంగతనాలను ఎంచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు అచ్చి మహేష్ రెడ్డి మీద చిన్నప్పుడే కేసు నమోదైనట్లు తెలిసింది. విశాఖపట్నంలోని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల వయసులోనే ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడినందుకు మహేష్ రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. దీంతో చిన్నప్పుడే జువనైల్ హోమ్‌లో ఉన్నారు.


జైలు నుంచి విడుదలైన తర్వాత, కాకినాడ, సర్పవరం, రామచంద్రపురం, ఇంద్రపాలెం, రాజమండ్రి పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడ్డారు. ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో మహేష్ రెడ్డి మీద 32కి పైగా దొంగతనాల కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైలులోనూ 14 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించాడు. మొత్తంగా 60కి పైగా ఇళ్లల్లలో చోరీలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌లో లగ్జరీ లైఫ్ జీవిస్తూనే.. విశాఖకు అప్పుడప్పుడూ వస్తూ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వివరించారు.

Latest News
Amelia Kerr, Jacob Duffy take top honours at New Zealand Cricket Awards Thu, Mar 26, 2026, 03:44 PM
Australian govt blocks entry for Iranian visa holders Thu, Mar 26, 2026, 03:39 PM
Japan starts releasing state oil reserves to blunt impact of West Asia tensions Thu, Mar 26, 2026, 03:32 PM
B'desh Prez Shahabuddin, PM Tarique Rahman pay tribute to 1971 martyrs on Independence Day Thu, Mar 26, 2026, 03:29 PM
Kerala polls: Tripura CM Saha to address BJP rallies in Kalpetta, Dharmadam Thu, Mar 26, 2026, 03:15 PM