|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 01:36 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై శ్రద్ధ లేదని వైయస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు వాస్తవాలు బయటపడుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో దేవినేని అవినాష్ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరమని అన్నారు. లడ్డూ ప్రసాదంలో ఎటువంటి జంతు కొవ్వు కలిసినట్లు ఆధారాలు లేవని సిట్ నివేదిక స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, చంద్రబాబు చేసిన ఆరోపణలను నిజం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. దుర్గగుడి మెట్లు కడిగి పవన్ కళ్యాణ్ , ఇప్పుడు నిజాలు బయటకు వచ్చిన నేపథ్యంలో ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కల్తీ జరిగిందని పేర్కొన్న ట్యాంకర్లను తనిఖీ చేసి పంపించింది కూటమి ప్రభుత్వమేనని, ఈ వ్యవహారంలో వైయస్ఆర్సీపీకి సంబంధం ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని ప్రశ్నించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టిందని దేవినేని అవినాష్ తెలిపారు. ప్రజలు నిజాలను గ్రహిస్తున్నారని, హిందువుల పట్ల నిజమైన అండగా నిలిచింది వైయస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. టీటీడీ లడ్డూ ప్రసాదంపై అపనమ్మకాన్ని సృష్టించింది చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు.
Latest News