|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 11:47 AM
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఆలయాలను, భక్తుల భద్రతను పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదే తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆరుగురు భక్తుల మృతి చెందగా, సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు, కాశీబుగ్గ తొక్కిసలాటలో తొమ్మిది మంది మరణించారని గుర్తు చేశారు. తాజాగా మహాశివరాత్రి వేళ శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తులపై లాఠీఛార్జ్ చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆయన ధ్వజమెత్తారు. ఒకవైపు కనీస సౌకర్యాలు కల్పించడంలోనూ, ఆలయాల్లో జరుగుతున్న వరుస దుర్ఘటనలను నివారించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు నోరెత్తడం లేదని నిలదీశారు. శ్రీశైలంలో శివస్వాములపై లాఠీచార్జ్ కి పాల్పడ్డ ఏఎస్పీపై చర్యలు తీసుకోవడంతో పాటు నైతిక బాధ్యతగా హోంమంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Latest News