|
|
by Suryaa Desk | Tue, Feb 24, 2026, 06:30 PM
తిరుపతి జిల్లా రంగంపేట దగ్గర మోహన్ బాబు యూనివర్సిటీ(ఎంబీయూ) లో విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపింది. బీటెక్ ఫైనలియర్ (డేటా సైన్స్) విద్యార్థిని భువన ఆత్మహత్య చేసుకుంది. సోమవారం రాత్రి తిరుపతి సమీపంలోని మంగళంలో ఉన్న సాయితేజ ప్రైవేట్ హాస్టల్లో ఫ్యాన్కు ఉరి వేసుకుంది. ఆమె గది డోర్ తీయకపోవడంతో హాస్టల్లో సిబ్బందికి సమాచారం ఇచ్చారు.. డోర్ పగులగొట్టి చూడగా ఆమె అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. అయితే భువన మరణంపై సమాచారాన్ని హాస్టల్ యాజమాన్యం ఆలస్యంగా ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. భువన ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భువన తల్లిదండ్రులు రుయా ఆస్పత్రికి వచ్చారు.. తమ కూతురి మరణంపై అనుమానాలు ఉన్నాయంటున్నారు.
భువన పుంగూరు నియోజకవర్గానికి సురేంద్ర రెడ్డి, జానకిల కుమార్తె. ఆమె క్లాస్ టాపర్ అని చెబుతున్నారు.. ఏకంగా 96% పర్సెంటేజ్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మధ్యే భువనకు రూ.17 లక్షల ప్యాకేజీతో మంచి ఉద్యోగం కూడా వచ్చిందట.. ఇంతలోనే ఇలా ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. కొద్దిరోజుల ముందే ఇంటికి ఫోన్ చేసి.. తనకు ఉద్యోగం వచ్చిందని.. ఇక మన కష్టాలు తీరాయంటూ తల్లిదండ్రులతో ఎంతో సంతోషంగా చెప్పిందట. ఇంతలోనే కూతురు ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు.పోలీసులు భువన ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే ఆత్మహత్యకు ముందు ఆమె గోడపై కొన్ని మాటలు రాసింది.. పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మోహన్బాబు యూనివర్శిటీ స్పందించాల్సి ఉంది.
మరోవైపు తిరుపతి జిల్లా రేణిగుంటలో కూడా మరో విషాద ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న పవిత్ర జ్వరం కారణంగా అస్వస్థతకు గురైంది. కాలేజీ యాజమాన్యం ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. అక్కడ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత దద్దుర్లు రావడంతో తల్లిదండ్రులు రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు.. ఆమె అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
Latest News