|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:33 PM
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని 20వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ దాకే అనిల్కుమార్, కౌన్సిల్ సమావేశానికి ఏకంగా ఓ తాచుపామును తీసుకురావడం తీవ్ర కలకలం రేపింది. అధికారుల తీరుకు నిరసనగా ఆయన ఈ చర్యకు పాల్పడ్డారు.శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి హాజరైన అనిల్కుమార్ ఓ సీసాలో బంధించిన పామును సంచిలో పెట్టుకొని హాల్లోకి వచ్చారు. తన కుర్చీ పక్కన ఆ సంచిని పెట్టుకోవడాన్ని ఏఈ హేమంత్ గమనించారు. దాన్ని బయటపెట్టి రావాలని కోరగా కౌన్సిలర్ నిరాకరించారు. చివరకు, ఛైర్మన్ ఆదినారాయణ గట్టిగా చెప్పడంతో ఆయన పాము ఉన్న సంచిని బయటపెట్టి వచ్చి సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అనిల్కుమార్ మాట్లాడుతూ గత రెండేళ్లుగా తన వార్డులో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ స్థలాలు, మున్సిపల్ పాఠశాల ఆవరణలో పిచ్చిమొక్కలు పెరిగిపోయాయని, వాటిని తొలగించాలని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు.ఉదయం పాఠశాల వద్ద ఈ తాచుపాము కనిపించిందని, ఓ బాలుడు దాన్ని గమనించకుండా పక్కనుంచే వెళ్లాడని తెలిపారు. ఆ బాలుడికి పాముకాటు వేసి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వార్డులో నెలకొన్న ప్రమాదకర పరిస్థితిని అధికారుల కళ్లకు కట్టేందుకే పామును సమావేశానికి తీసుకువచ్చానని ఆయన వివరించారు.
Latest News