|
|
by Suryaa Desk | Thu, Apr 30, 2026, 09:23 PM
అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఘాటు హెచ్చరిక జారీ చేశారు. గల్ఫ్ ప్రాంత భద్రతను ఇకపై పూర్తిగా ఇరాన్ స్వయంగా చూసుకుంటుందని, ఈ సముద్ర మార్గంలో విదేశీ శక్తుల జోక్యాన్ని ఏమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అస్థిరత సృష్టించే బయటి శక్తులకు ఇక్కడ స్థానం ఉండదని ఖమేనీ పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే వారిని “సముద్ర గర్భంలో పాతిపెడతాం” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా విధించిన ఆంక్షల అంశంపై చర్చలు కొనసాగుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్పై ఉన్న ఆంక్షలను తొలగించాలన్న ప్రతిపాదనను తిరస్కరించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఆంక్షలు ఎత్తివేసే వరకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మార్గాన్ని తెరవబోమని ఇరాన్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఈ మార్గం పరిమితమవడంతో ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.గల్ఫ్, హోర్ముజ్ ప్రాంతాల్లో కొత్త భద్రతా వ్యవస్థ ఏర్పడుతోందని, ఇది ప్రాంతీయ శాంతికి తోడ్పడటమే కాకుండా పొరుగు దేశాలకు ఆర్థిక ప్రయోజనాలు కలిగిస్తుందని ఖమేనీ అభిప్రాయపడ్డారు.అదే సమయంలో అమెరికా ఉనికిపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. పర్షియన్ గల్ఫ్లో అస్థిరతకు కారణం అమెరికా జోక్యమేనని, తమ సొంత స్థావరాలనే రక్షించుకోలేని దేశం ఇతరులకు భద్రత ఎలా కల్పిస్తుందని వ్యంగ్యంగా ప్రశ్నించారు.ఇటీవలి కాలంలో అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ ప్రాంతంలో చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అమెరికా ఆంక్షల వల్ల చమురు వ్యాపారం ఒత్తిడిలో ఉన్నప్పటికీ, ఇతర గల్ఫ్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటూ ఈ ప్రాంతంలో ప్రభావాన్ని పెంచాలని ఇరాన్ ప్రయత్నిస్తోంది.ఈ నేపథ్యంలో ఇరాన్ నేవీ కమాండర్ కొత్త ఆయుధ సామర్థ్యాలను ప్రస్తావించగా, వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే జోక్యాలకు “సముద్రపు లోతులే సమాధానం” అని ఖమేనీ హెచ్చరించారు.
Latest News