ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. శపథం నెరవేర్చుకున్న మంత్రి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 07, 2024, 05:49 PM

పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు గులాబీ పార్టీని వీడారు. కారు పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగానే.. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే గులాబీ పార్టీ ఝలక్ ఇచ్చారు. కారు దిగి హస్తం పంచన చేరారు.


భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఇవాళ గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకట్రావుతో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక నేతలు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు.


కాగా, తెల్లం వెంకట్రావు పార్టీ మార్పుపై ఎప్పట్నుంచో ఉహాగానాలు వస్తున్నాయి. నిజానికి కడియం, దానం కంటే ముందు ఆయనే పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ వచ్చిన కాసేపటికే రేవంత్, పొంగులేటితో భేటీ అయినట్లు వార్తలు కూడా వచ్చాయి. అనంతరం అదంతా అబద్ధమని తెల్లం స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత మంత్రులు జిల్లాకు వచ్చిన సందర్భంలో వారిని వ్యక్తిగతంగా కలిశారు. సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఫ్యామిలీతో వెళ్లి మీట్ అయ్యారు


తుక్కుగూడ జనజాతర సభలో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆయన కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెల్లం పొంగులేటి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఆయనతో పాటే గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పొదెం వీరయ్యకు కాంగ్రెస్ టికెట్ కేటాయించటంతో తిరిగి బీఆర్ఎస్‌లో చేరి టికెట్ తెచ్చుకున్నారు. ఎన్నికల్లో వీరయ్యను ఓడించి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు.


ఖమ్మం నుంచి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శపథం చేశారు. జిల్లాలో క్లీన్ స్వీప్ సాధిస్తామన్నారు. అయితే అనుహ్యంగా ఆయన అనుచరుడైన తెల్లం బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించాడు. మెుత్తం 10 సీట్లకు గాను భద్రాచలం మినహా 9 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తాజాగా తెల్లం కూడా కాంగ్రెస్‌లో చేరటంతో మంత్రి ఆనాడు చేసిన శపథం నెరవేరినట్లయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa