ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త రేషన్ కార్డులు, రూ. 4 వేల పెన్షన్.. ఇచ్చేది అప్పుడే, మంత్రి కీలక ప్రకటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 07:48 PM

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల్ పెంపుపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రేషన్ కార్డులు, పెన్షన్ల పెంపు ఉంటుందని చెప్పారు. కొత్త పెన్షన్లు ఇవ్వటంతో పాటు ఇప్పుడున్న పెన్షన్‌ను రూ. 4 వేలకు పెంచుతామన్నారు. ఆగష్టు నెలలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని.. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.


 'ఎన్నికల కోడ్ ముగియగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందిస్తాం. మతపరమైన లబ్ధి పొందాలని.. విద్వేషాల ద్వారా గెలవాలని బీజేపీ చూస్తుంది. ప్రజా ప్రతినిదులు ప్రజా సమస్యలపై అందుబాటులో ఉండాలి. అవన్నీ వదిలిపెట్టి మత పరమైన అంశాలను ప్రేరేపించడం ద్వారా గెలవాలని చూస్తున్నారు. బండి సంజయ్, వినోద్ కుమార్‌లు ఈ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పండి. ఒక్క పని అయినా చెప్పండి. బండి సంజయ్ ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉన్నారా ? సమస్యలు పరిష్కరించారా ? ఈ నియోజకవర్గానికి ఏమైనా చేశారా ?


పైకి జై శ్రీరామ్ లోలోపల రిజర్వేషన్లకు రాం రాం అంటుంది బీజేపీ. మతం, విద్వేషాలు రెచ్చగొట్టే లబ్ధి పొందాలని బండి సంజయ్ చూస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి గెలుపు కోసం ఐక్యంగా కృషి చేస్తున్నాం. అభ్యర్థి ప్రకటన ఆలస్యం అయినా ప్రచారంలో ముందున్నాం. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాం. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. సాగు నీటి సమస్యలు, నేతన్నల సమస్యలు తీరుస్తాం. శాతవాహన యునివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజి తేవాల్సిన అవసరం ఉంది. విభజన హామీలు అమలు చేయాల్సిన అవసరం ఉంది.


నిరుద్యోగుల సమస్యలు, విద్యా, వైద్యం ,రవాణాలో అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గ్రాప్ పడిపోయింది. దేశంలో శాంతి లేదు. దేశంలో సంపద కాంగ్రెస్ వస్తే ముస్లింలకు పంపిణీ చేస్తుందనీ, ఆస్తులు పంచుతుందని, అర్బన్ నక్సలిజం వస్తుందని మోదీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని మతాలు, వర్గాలకు స్వేచ్చ ఉంది. మోదీ మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. అద్వానీ కట్టిన మెట్లపై వచ్చి పీఠం ఎక్కిన వ్యక్తి మోదీ. వేములవాడ దేవాలయానికి ప్రసాద్ స్కీమ్ ఎందుకు ఇవ్వలేదు. రాష్ట్రంలో అన్ని పనులు జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండాలి.' అని పొన్నం ప్రభాకర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa