ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూకట్‌పల్లి సంత చెప్పిన ఏపీ పోలింగ్ కథ.. ఈ ఎన్నికల ‘సంక్రాంతి’ ఎవరికి కలిసి రానుంది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 07:45 PM

తెలుగు ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం వచ్చేసింది. ఓవైపు వైఎస్సార్సీపీ.. మరో వైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉండటంతో.. ప్రతి ఓటూ కీలకం కానుంది. దీంతో ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఓటర్లకు నాయకులు ఫోన్లు చేసిన రప్పిస్తున్నారు. ఛార్జీలతోపాటు దారి ఖర్చులు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారు. నాయకుల ఆఫర్లకు తోడు.. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే ఓటేయాలనే తపన ఓటర్లలో కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఓటర్లు వివిధ ప్రాంతాల నుంచి ఏపీకి వెళ్లిపోయారు.


హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ వాసులు కూడా పెద్ద సంఖ్యలో తమ స్వస్థలానికి వెళ్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఐటీ ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవు కావడం.. ఓటింగ్ జరిగే సోమవారం కూడా సెలవు కావడంతోపాటు.. పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కావడంతో.. చాలా మంది శుక్రవారమే హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లిపోయారు. దీంతో రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా కనిపిస్తోంది. శని, ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో జనం ఓటేయడం కోసం హైదరాబాద్ నుంచి తమ స్వస్థలాలకు వెళ్లనున్నారు.


హైదరాబాద్‌‌లో ఆంధ్రా ప్రజలు ఎక్కువగా నివాసం ఉండే కూకట్‌పల్లి ప్రాంతం బోసిపోయి కనిపిస్తోంది. కూకట్‌పల్లి మెట్రోను ఆనుకుని ఉండే బాలాజీ నగర్ ప్రాంతంలో ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది. ఈ ఫ్రైడే మార్కెట్‌కు వేలాది మంది కాలనీ వాసులు వచ్చి కూరగాయలు, పండ్లు కొనుగోలు చేస్తుంటారు. ప్రతి శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇక్కడ సంత జరుగుతుంది. దీంతో ఇక్కడకు వచ్చి కూరగాయలు విక్రయించేందుకు వ్యాపారులు సైతం ఆసక్తి చూపుతుంటారు.


అయితే ఎన్నికల ఎఫెక్ట్‌తో బాలాజీ నగర్‌లో ఈ శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సంతకు జనం పలుచగా వచ్చారు. ఫలితంగా వ్యాపారులు తెచ్చిన సరుకు అమ్ముడుపోలేదు. ఎన్నికల కోసం జనం ఊరెళ్లడంతో.. తమ కూరగాయలు అమ్ముడుపోలేదని.. తిరిగి సరుకుంతా మళ్లీ వెనక్కి తీసుకెళ్లాలని.. దారి ఖర్చులు కూడా రావడం లేదని చిరు వ్యాపారులు వాపోయారు. ఇప్పటి దాకా ఎన్నో ఎన్నికలు జరిగాయని.. కానీ ఇంత పెద్ద సంఖ్యలో జనం వెళ్లడం.. అదీ ఎన్నికలకు మూడ్రోజుల ముందే వెళ్లడాన్ని తామెప్పుడూ చూడలేదని ఆ వ్యాపారులు చెప్పడం గమనార్హం.


హైదరాబాద్ నుంచి రైళ్లు, బస్సులతోపాటు లక్షలాది ప్రయివేట్ వాహనాలు ఆంధ్రా వైపు వెళ్తున్నాయి. ఎన్నికల ముందు ఇంత పెద్ద సంఖ్యలో జనం వెళ్తుండటంతో సంక్రాంతి సీజన్ గుర్తొస్తుంది. మరి ఈ ఎన్నికల సంక్రాంతి.. టీడీపీ, వైఎస్సార్సీపీల్లో ఏ పార్టీకి పండుగ కానుందో మరి..? ఇంత భారీ మొత్తంలో జనం ఓటేయడానికి వెళ్తుండటాన్ని బట్టి చూస్తే.. ఈసారి ఏపీలో గతంలో కంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa