ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం పీపీపీ (PPP), పీ4 (P4) అంటూ జపం చేస్తున్నారని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో చేసే టెండర్లకు ఎవరూ ముందుకు రావడం లేదని, అయినా సరే అదే మొండి వైఖరితో ముందుకు వెళ్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి అంటే కేవలం కాంట్రాక్టర్లకు మేలు చేయడమే అన్నట్లుగా బాబు పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు.
వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే వారు కేవలం వ్యాపారం మాత్రమే చేస్తారనే కనీస విషయాన్ని ప్రభుత్వం మర్చిపోతోందని పేర్ని నాని వ్యాఖ్యానించారు. పేదలకు ఉచితంగా అందాల్సిన వైద్య సేవలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడం వల్ల సామాన్యులు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తే, ఇప్పుడు వాటిని నిర్వీర్యం చేసి ప్రైవేట్ సంస్థలకు లాభాలు చేకూర్చేలా అడుగులు వేస్తున్నారని దుయ్యబట్టారు.
విశాఖపట్నంలో విలువైన భూములను దోచుకుంటున్నారని, అందులో భాగంగానే 90 పైసలకే దాదాపు 50 ఎకరాల భూమిని కట్టబెడుతున్నారని పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. పారిశ్రామికాభివృద్ధి పేరుతో ప్రభుత్వ ఆస్తులను తక్కువ ధరకు అస్మదీయులకు పంచుతున్నారని ఆయన మండిపడ్డారు. భూముల కేటాయింపుల్లో పారదర్శకత లేదని, కేవలం తమకు కావాల్సిన వారికి దోచిపెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
సామాన్యులు మరియు పేదల పట్ల చంద్రబాబు నాయుడు దృక్పథం ఎప్పటికీ మారదని, ఆయన ఆలోచనలన్నీ ధనవంతులకు మేలు చేసేలాగే ఉంటాయని నాని పేర్కొన్నారు. గత పదేళ్లుగా అదే ధోరణి కనిపిస్తోందని, సంక్షేమం కంటే వ్యాపార ప్రయోజనాలకే బాబు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆక్షేపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండి వైఖరి వీడి, సామాన్య ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించాలని ఆయన హితవు పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa