ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళపై అత్యాచారం చేసి,,,,'నువ్వు నన్నేమీ చేయలేవు' అనే గర్వంతో సవాల్ విసిరిన బీజేపీ నేత

national |  Suryaa Desk  | Published : Sun, Dec 28, 2025, 08:00 PM

మధ్య ప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో అధికార బీజేపీ నేత ఒకరు సాగించిన అరాచకం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఒక మహిళను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. ఆ దృశ్యాలను వీడియో తీసి నెలల తరబడి ఆమెను బ్లాక్‌మెయిల్ చేశాడు. బాధితురాలు ఎదురు తిరిగితే.. "నన్ను ఎవరూ ఏమీ చేయలేరు.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకో" అంటూ రాజకీయ పలుకుబడితో రెచ్చిపోయి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


కత్తితో బెదిరించి అరాచకం, ఏడాదిన్నరగా నరకం..


సత్నా జిల్లాలోని రాంపూర్ బాఘేలన్ నగర్ పరిషత్ బీజేపీ కౌన్సిలర్ భర్త అయిన అశోక్ సింగ్.. ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. సుమారు ఆరు నెలల క్రితం అశోక్ సింగ్ ఆమె ఇంట్లోకి చొరబడి, కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాలను తన మొబైల్‌లో రికార్డు చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని.. ఆమె కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించాడు. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని పదే పదే తన కోరిక తీర్చాలంటూ ఆమెను నరకయాతనకు గురిచేశాడు.


 "నన్ను ఎవడూ పట్టుకోలేడు"..


డిసెంబర్ 20వ తేదీన నిందితుడు మరోసారి బాధితురాలిని వేధిస్తూ.. తాను చెప్పినట్లు వినకపోతే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. ఈ క్రమంలోనే బాధితురాలు ధైర్యంగా అతడిని కెమెరా ముందు నిలదీసింది. తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని.. అతడి అరాచకాలను బయటపెడతానని హెచ్చరించగా.. అశోక్ సింగ్ అత్యంత అహంకారంతో స్పందించాడు. "నీ ఇష్టం వచ్చిన చోట ఫిర్యాదు చేసుకో.. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. నాకేం కాదు" అంటూ బాధితురాలిని హేళన చేశాడు. దీంతో సదరు మహిళ ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. ఇలా ఇది కాస్తా త్వరగానే వైరల్ అయింది. ఇది చూసిన స్థానిక ప్రజలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


పోలీసుల వైఫల్యంపై బాధితురాలి ఆవేదన


నిందితుడు అశోక్ సింగ్‌కు నేరచరిత్ర ఉందని, గతంలో అతడిని జిల్లా నుంచి బహిష్కరించినట్లు కూడా బాధితురాలు పేర్కొంది. అయినప్పటికీ అధికార పార్టీ అండతో అతడు యథేచ్ఛగా తిరుగుతున్నాడని ఆరోపించింది. ఐదు రోజుల క్రితమే పోలీసులను ఆశ్రయించినా.. తన ఫిర్యాదుపై సరైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణాపాయం ఉందని.. తమకు ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యతని ఆమె హెచ్చరించింది.


ప్రస్తుతం ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న సత్నా ఎస్పీ హంసరాజ్ సింగ్.. దర్యాప్తును డిప్యూటీ ఎస్పీ మనోజ్ త్రివేదికి అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని, వైరల్ వీడియో ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఒక మహిళపై ఇలాంటి అరాచకానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa