ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగ్లాలో హిందువుల ఊచకోతపై అమెరికా ఆందోళన

international |  Suryaa Desk  | Published : Sun, Dec 28, 2025, 09:10 PM

బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న హింసాకాండ ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. తాజాగా వస్త్ర కార్మికుడు దీపూ చంద్రదాస్‌ను మతోన్మాద మూక కిరాతకంగా చంపడంపై అమెరికా తీవ్రంగా స్పందించింది. అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ఈ ఘటనను "అత్యంత అమానవీయమైనది" గా అభివర్ణించడమే కాకుండా.. ఇలాంటి విద్వేషపూరిత చర్యలను ప్రపంచం మొత్తం ఏకమై ఖండించాలని పిలుపునిచ్చారు.


దీపూ చంద్రదాస్ హత్య.. విద్వేషానికి పరాకాష్ట


ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న అబద్ధపు ఆరోపణలతో దీపూ చంద్రదాస్ అనే యువకుడిని మైమెన్‌సింగ్‌లో ఒక మూక దారుణంగా కొట్టి చంపింది. అంతటితో ఆగకుండా అతడి మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టిన వైనం సభ్యసమాజాన్ని విస్తుపోయేలా చేసింది. ఈ ఘటనపై రో ఖన్నా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. "మతతత్వం, విద్వేషంతో సాగే ఇలాంటి నీచమైన చర్యలకు చోటు ఉండకూడదు. బాధితులకు న్యాయం జరిగే వరకు మన గొంతుక వినిపించాలి" అని పిలుపునిచ్చారు.


అమెరికా విదేశాంగ శాఖ కూడా ఈ హత్యలను తీవ్రంగా పరిగణించింది. బంగ్లాదేశ్‌లోని అన్ని వర్గాల భద్రతను పర్యవేక్షించాల్సిన బాధ్యత అక్కడి తాత్కాలిక ప్రభుత్వంపై ఉందని గుర్తు చేసింది. మత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛకు అమెరికా ఎల్లప్పుడూ మద్దతిస్తుందని.. మైనార్టీల రక్షణ కోసం బంగ్లాదేశ్ తీసుకుంటున్న చర్యలను నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది.


ఉద్రిక్తతకు ఆజ్యం పోస్తున్న హత్యలు..


యువ నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్‌లో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని మతోన్మాద శక్తులు హిందువులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. దీపూ దాస్ హత్య మరవక ముందే.. రాజ్‌బారి జిల్లాలో అమృత్ మొండల్ (అలియాస్ సామ్రాట్) అనే వ్యక్తిపై కూడా గ్రామస్థులు మూక దాడి చేసి ప్రాణాలు తీశారు. అయితే పోలీసులు ఇది మతపరమైన దాడి కాదని, వసూళ్ల గొడవ అని చెబుతున్నప్పటికీ.. వరుసగా హిందువులే లక్ష్యం కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.


భారత్ ఆందోళన.. అంతర్జాతీయ ఒత్తిడి


బంగ్లాదేశ్‌లో హిందువుల అస్తిత్వం ప్రమాదంలో పడటంపై భారత ప్రభుత్వం ఇప్పటికే తన గంభీరమైన నిరసనను వ్యక్తం చేసింది. అమెరికాలోని మరికొందరు ప్రజాప్రతినిధులు రాజా కృష్ణమూర్తి, సుహాస్ సుబ్రహ్మణ్యం కూడా ఈ హింసపై ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖండనలతో సరిపెట్టకుండా, నిందితులను కఠినంగా శిక్షించాలని, మైనారిటీలకు పూర్తి రక్షణ కల్పించాలని వారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa