ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేఘాలయ మీదుగా భారత్‌లోకి,,,హాదీ హత్య కేసు హంతకులు,,,,సరిహద్దుల్లో హై అలర్ట్

international |  Suryaa Desk  | Published : Sun, Dec 28, 2025, 09:03 PM

బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన 'ఇంకిలాబ్ మంచో' నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యకు పాల్పడిన ఇద్దరు ప్రధాన నిందితులు భారత్‌లోకి పారిపోయినట్లు ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు  అధికారికంగా ధృవీకరించారు. మేఘాలయ సరిహద్దుల గుండా వారు అక్రమంగా సరిహద్దు దాటినట్లు దర్యాప్తులో తేలింది.


సరిహద్దు దాటిన హంతకులు?


ఢాకాలో జరిగిన మీడియా సమావేశంలో అదనపు కమిషనర్ ఎన్. నజ్రుల్ ఇస్లాం మాట్లాడుతూ.. నిందితులు ఫైసల్ కరీమ్ మసూద్, ఆలంగీర్ షేక్ మైమెన్సింగ్‌లోని హలువాఘాట్ సరిహద్దు ద్వారా భారత్‌లోకి ప్రవేశించారని తెలిపారు. వీరిద్దరూ సరిహద్దు దాటాక 'పుర్తి' అనే వ్యక్తి వారిని రిసీవ్ చేసుకున్నాడని.. ఆ తర్వాత 'సమీ' అనే టాక్సీ డ్రైవర్ వారిని మేఘాలయలోని తురా పట్టణానికి తరలించినట్లు సమాచారం అందిందని వివరించారు. ఈ క్రమంలో వీరికి సహకరించిన పుర్తి, సమీలను ఇప్పటికే భారత అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు అనధికారిక నివేదికలు అందాయని.. అయితే దీనిపై భారత్ నుంచి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉందన్నారు.


ఉస్మాన్ హాదీ ఎవరు?


షరీఫ్ ఉస్మాన్ హాదీ కేవలంఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. గత ఏడాది షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి దారితీసిన విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. భారత్, అవామీ లీగ్‌ను తీవ్రంగా విమర్శించే హాదీ.. 'ఇంకిలాబ్ మంచో' పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేసి, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే డిసెంబర్ 12వ తేదీన ఢాకాలో ముసుగు ధరించిన దుండగులు ఆయన తలపై కాల్పులు జరిపారు. సింగపూర్‌లో చికిత్స పొందుతూ డిసెంబర్ 18వ తేదీన ఆయన కన్నుమూశారు.


మొత్తం దేశాన్ని చుట్టుముట్టిన హింసాకాండ


హాదీపై దాడి జరిగినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో మంటలు చెలరేగుతున్నాయి. ఆయన మరణం తర్వాత ఢాకాలోని ప్రముఖ వార్తాపత్రికలైన 'ప్రథమ్ ఆలో', 'ది డైలీ స్టార్' కార్యాలయాలతో పాటు పలు సాంస్కృతిక సంస్థలపై నిరసనకారులు దాడులు చేసి నిప్పు పెట్టారు. ఈ అల్లర్లు మతపరమైన హింసకు కూడా దారితీశాయి. మైమెన్‌సింగ్‌లో ఒక హిందూ వస్త్ర కార్మికుడిని మూకదాడిలో దారుణంగా చంపడం దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతోంది.


ప్రస్తుతం భారత్‌లో ఉన్నట్లు భావిస్తున్న హంతకులను తిరిగి రప్పించేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అధికారిక, అనధికారిక మార్గాల్లో భారత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని నజ్రుల్ ఇస్లాం తెలిపారు. హంతకులను పట్టుకుని అప్పగిస్తేనే హాదీ హత్య వెనుక ఉన్న అసలు కుట్రదారులు ఎవరన్నది బయటపడుతుందని ఢాకా పోలీసులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa