గత మే నెలలో భారత్ చేపట్టిన అత్యంత శక్తివంతమైన 'ఆపరేషన్ సింధూర్' దెబ్బకు తన సైనిక స్థావరాలు చిన్నాభిన్నమయ్యాయని పాకిస్థాన్ ఎట్టకేలకు బాహాటంగా అంగీకరించింది. శనివారం జరిగిన వార్షిక మీడియా సమావేశంలో పాక్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. రావల్పిండిలోని వ్యూహాత్మక 'నూర్ ఖాన్ ఎయిర్ బేస్'పై భారత్ జరిపిన దాడుల్లో భారీ నష్టం వాటిల్లిందని.. తమ సైనికులు గాయపడ్డారని ఆయన ధ్రువీకరించారు.
36 గంటల్లో 80 డ్రోన్లు.. ఉక్కిరిబిక్కిరి చేసిన భారత్
ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్లో 26 మంది పౌరుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మే 7వ తేదీన 'ఆపరేషన్ సింధూర్' ప్రారంభించింది. ఈ ఆపరేషన్ తీవ్రతను వివరిస్తూ ఇషాక్ దార్ షాకింగ్ వివరాలు వెల్లడించారు. "భారత్ కేవలం 36 గంటల వ్యవధిలో పాక్ భూభాగంలోకి కనీసం 80 డ్రోన్లను పంపింది. మేము 79 డ్రోన్లను అడ్డుకోగలిగాము. కానీ ఒక్క డ్రోన్ మాత్రం నూర్ ఖాన్ ఎయిర్ బేస్ను తాకి తీవ్ర నష్టం కలిగించింది" అని ఆయన పేర్కొన్నారు. అయితే పాక్ మంత్రి చెబుతున్నది కేవలం పాక్షిక సత్యమేనని అంతర్జాతీయ రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
138 మందికి మరణానంతర అవార్డులు..
మంత్రి ఇషాక్ దార్ ఈ నష్టాన్ని "స్వల్పం" అని కొట్టిపారేయడాన్ని భారత సైనిక వెటరన్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) కేజేఎస్ ధిల్లాన్ తీవ్రంగా ఖండించారు. "పాకిస్థాన్ తన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా (ఆగస్టు 14వ తేదీ 2025న) ఆపరేషన్ సింధూర్ సమయంలో మరణించిన 138 మంది సైనికులకు మరణానంతర శౌర్య పురస్కారాలను ప్రకటించింది. 138 మందికి అవార్డులు ఇచ్చారంటే.. కనీసం 400 నుంచి 500 మంది సైనికులు ఈ దాడుల్లో మరణించి ఉంటారు. నూర్ ఖాన్ బేస్ మంటల్లో తగలబడుతున్న వీడియోలను ప్రపంచం చూసింది" అని ఆయన ఎండగట్టారు.
కేవలం నూర్ ఖాన్ మాత్రమే కాదు.. సర్గోధా, రఫీఖీ, జాకోబాబాద్, మురిడ్కే సహా మొత్తం 11 పాక్ వైమానిక స్థావరాలను భారత్ టార్గెట్ చేసింది. ఈ దాడుల సమయంలో ప్రయోగించిన 'బ్రహ్మోస్' క్రూయిజ్ మిస్సైల్ అణుబాంబును మోసుకెళ్తుందా లేదా అని నిర్ధారించుకోవడానికి తమకు కేవలం 30 నుంచి 45 సెకన్ల సమయం మాత్రమే దొరికిందని పాక్ ప్రధాని సలహాదారు రాణా సనావుల్లా గతంలో ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు కూడా పాక్ ఎయిర్ బేస్లు ఎంత దారుణంగా దెబ్బతిన్నాయో స్పష్టం చేశాయి. గతంలో ఈ దాడుల ప్రభావంపై ఏమీ జరగలేదని బుకాయించిన ఇస్లామాబాద్.. ఇప్పుడు ఏకంగా విదేశాంగ మంత్రి స్థాయి వ్యక్తితో జరిగిన నష్టాన్ని ఒప్పించడం.. భారత సైనిక సామర్థ్యానికి, పక్కా వ్యూహరచనకు నిదర్శనంగా నిలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa