రైళ్లలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రైల్వే శాఖ రానున్న ఐదు సంవత్సరాల్లో రైళ్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 48 నగరాలను దీని కోసం ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి, విశాఖపట్నం , విజయవాడ రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. రానున్న రోజుల్లో ఈ స్టేషన్ల నుంచి నడిచే రైళ్ల సంఖ్య రెట్టింపు కానుంది. ఈ క్రమంలో విశాఖ రైల్వే స్టేషన్కు సంబంధించి కీలక అలర్ట్ జారీ చేశారు, ఇది ప్రయాణికులకు నిజంగా శుభవార్త అనే చెప్పవచ్చు. స్టేషన్ అభివృద్ధి కోసం రూ. 500 కోట్లు కేటాయించడమే కాక, రానున్న 5 ఏళ్లలో ఈ స్టేషన్లో రైళ్ల సంఖ్యను రెట్టింపు, అనగా 74కు, పెంచనున్నారు.
రాబోయే ఐదేళ్లలో విశాఖపట్నం నుంచి నడిచే రైళ్ల సంఖ్య రెట్టింపు అవుతుందని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే రూ. 500 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. విశాఖ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారాల సంఖ్యను 8 నుంచి 14కు పెంచుతామని ఎంపీ శ్రీభరత్ తెలిపారు. రాబోయే ఐదేళ్లలో విశాఖపట్నం డివిజన్లో మరిన్ని అభివృద్ధి పనులు జరుగుతాయని రైల్వే వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి రోజుకు 37 రైళ్లు నడుస్తున్నాయి. కేంద్రం నిర్ణయం ప్రకారం, రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య 74కు చేరుకుంటుంది. అంటే, విశాఖ నుంచి డిమాండ్ అధికంగా ఉండే సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, కోల్కతా, రాయ్పూర్ వంటి నగరాలతో పాటు, అరకులోయ వంటి పర్యాటక ప్రాంతాలకు కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తాయి. వీటితో పాటు విశాఖ నుంచే కాశీ వంటి పుణ్యక్షేత్రాలకు కూడా రైళ్లు నడిచే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తిరుపతి, బెంగళూరులకు వందేభారత్ రైళ్లు నడపాలనే ప్రతిపాదనలు కూడా కార్యరూపం దాల్చుతాయి.
విశాఖపట్నం రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. ఇక్కడ లైన్ల సంఖ్య పరిమితంగా ఉండటంతో, కొన్ని రైళ్లు దువ్వాడ దాటిన తర్వాత స్టేషన్ బయటే ఆగిపోతున్నాయి. మరికొన్ని రైళ్లను ఒకటి, 2 రోజుల తర్వాత షెడ్యూల్ చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో వాటిని నిలిపి ఉంచడానికి సరైన చోటు లేక, నగర శివారు మార్గాల్లో ఖాళీగా ఉన్న లైన్లలో వాటిని నిలిపి ఉంచుతున్నారు. దీనివల్ల రైళ్ల నిర్వహణ కష్టమవుతోంది.
అయితే ఈ సమస్యలకు పరిష్కారంగా.. జగన్నాథపురాన్ని శాటిలైట్ స్టేషన్గా అభివృద్ధి చేయాలని అధికారులు ప్రతిపాదించారు. అక్కడ పెద్ద కోచింగ్ మెయింటెనెన్స్ డిపోతో పాటు, భారీ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ. 2,800 కోట్లతో ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు పంపించారు.
ఇదిలా ఉంటే.. విశాఖపట్నంలో రైల్వే యార్డును ఆధునీకరించడానికి డీపీఆర్ సిద్ధమైంది. ఇందులో 5 కొత్త లైన్లు, 10 స్టేబిలింగ్ లైన్లు, అదనపు ప్యాసింజర్ ప్లాట్ఫారాలు, ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వంటి సౌకర్యాలు కల్పించాలని బోర్డుకు ప్రతిపాదించారు. వీటితో పాటుగా ఫ్లైఓర్లు, బైపాస్లు, ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్లను కూడా నిర్మించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. ఇవన్నీ పూర్తయితే ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలోఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa