ముంబై కోర్టులో తాజాగా వెలుగుచూసిన ఒక గృహ హింస కేసు సినిమా క్లైమాక్స్ను తలపించింది. 17 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం చివరకు ఒక అనూహ్య మలుపుతో ముగిసింది. తన మొదటి భర్తపై భార్య వేసిన కేసులో.. ఆమె రెండో భర్తే స్వయంగా వచ్చి సాక్ష్యం చెప్పడంతో మొదటి భర్త గెలిచిన ఈ వింత కేసు గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
అసలేమిటీ వివాదం?
ఈ గొడవంతా 2005లో ప్రారంభం అయింది. ఓ మహిళకు ఇదే ఏడాది ఆమె కుటుంబ సభ్యులు ఓ అబ్బాయితో వివాహం జరిపించారు. అయితే అప్పటికే అతడికి వివాహం కావడం.. ఈ విషయాన్ని తన వద్ద దాచడంతో సదరు మహిళ కోర్టును ఆశ్రయించింది. ముఖ్యంగా తన భర్త మొదటి భార్య తరచుగా ఇంటికి వస్తూ తనను శారీరకంగా, మానసికగా వేధిస్తోందని ఆరోపిస్తూ.. 2009లో బోరివలి కోర్టులో గృహ హింస కేసు వేసింది. తనను ఇంటి నుంచి వెళ్లగొట్టారని, తనకు రక్షణతో పాటు భరణం ఇప్పించాలని కోరింది. దీనిపై స్పందించిన కోర్టు.. కేసు తేలే వరకు నెలకు రూ. 3,200 మధ్యంతర భరణం చెల్లించాలని అప్పట్లో మొదటి భర్తను ఆదేశించింది.
ఇక వేరే ఆప్షన్ లేకపోవడంతో.. మొదటి భర్త గత 17 ఏళ్లుగా ఆమెకు భరణం చెల్లిస్తూనే వస్తున్నాడు. అయితే దీన్నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ఆయన ఇటీవల మాస్టర్ ప్లాన్ వేశాడు. ముఖ్యంగా తన భార్య ఇప్పటికే రెండో పెళ్లి చేసుకుందని.. కాబట్టి ఆమెకు భరణం పొందే హక్కు లేదని వాదించాడు. దీన్ని నిరూపించేందుకు అతను ఏకంగా ముగ్గురు కీలక సాక్షులను రంగంలోకి దింపాడు. అందులో ఆమెకు రెండో నిఖా (పెళ్లి) జరిపించిన ఇమామ్, నిఖా పత్రాలపై ఉన్న సంతకాలు, వేలిముద్రలు ఆ మహిళవేనని ధృవీకరించిన నిపుణుడు సహా ఆమె రెండో భర్తను సైతం సాక్ష్యంగా కోర్టు ముందు ఉంచాడు.
మొదటి భర్త తరపున సాక్ష్యం చెప్పడానికి వచ్చిన రెండో భర్త.. కోర్టులో అందరి ముందే "అవును, ఆమె నా భార్యే" అని స్పష్టం చేశాడు. భార్య వేసిన గృహ హింస కేసులో రెండో భర్తే స్వయంగా వచ్చి మొదటి భర్త తరపున సాక్ష్యం చెప్పడం కోర్టు హాల్లోని వారందరినీ విస్మయానికి గురిచేసింది. కానీ వెంటనే తేరుకున్న న్యాయమూర్తి షాకింగ్ తీర్పును ఇచ్చారు. ముఖ్యంగా అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ బి.ఎన్. చిక్నే ఈ కేసులో.. సాక్ష్యాధారాలు, పత్రాల ప్రకారం ఆ మహిళకు విడాకులు పూర్తి అయ్యాయని, ఆమె రెండో వివాహం చేసుకున్నట్లు స్పష్టంగా రుజువైందని పేర్కొన్నారు.
"ప్రస్తుత భర్తే స్వయంగా వివాహాన్ని ధృవీకరించారని.. ఇక ఆ మహిళ తన మొదటి భర్త నుంచి ఎలాంటి భరణం లేదా రక్షణ కోరే హక్కు ఉండదని" అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. రెండో పెళ్లి జరగడం వల్ల ఆమె మొదటి భర్తపై ఆధారపడిన వ్యక్తిగా ఉండదని పేర్కొంటూ.. 17 ఏళ్ల క్రితం ఆమె దాఖలు చేసిన గృహ హింస కేసును కోర్టు కొట్టివేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa