వైద్యులను దైవంతో సమానంగా భావిస్తారు.. కానీ కొందరు వైద్యుల నిర్లక్ష్యం సామాన్యుల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడుతుందో చెప్పడానికి గ్రేటర్ నోయిడాలో వెలుగు చూసిన ఈ ఘటనే నిదర్శనం. ఒక మహిళకు ప్రసవం చేసిన సమయంలో ఆమె కడుపులోనే అరమీటరు పొడవున్న సర్జికల్ గుడ్డను వదిలేసి కుట్లు వేశారు వైద్యులు. ఆ తప్పును గుర్తించకపోవడంతో.. సుమారు 18 నెలల పాటు ఆ మహిళ నరకయాతన అనుభవించింది. కానీ చివరకు విషయం వెలుగులోకి రావడంతో.. కోర్టు జోక్యం చేసుకుంది. సదరు ఆసుపత్రి వైద్యులతో పాటు జిల్లా ఆరోగ్య శాఖ అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే?
గ్రేటర్ నోయిడాలోని డెల్టా-1 ప్రాంతానికి చెందిన అన్షుల్ వర్మ అనే మహిళ ఇంట్లోనే ఉండి కుట్టు పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే ఆమె 2023 నవంబర్ 14వ తేదీన తుగ్లక్పూర్లోని బాక్సన్ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరింది. డాక్టర్ అంజనా అగర్వాల్ ఆమెకు సీ సెక్షన్ చేసి మరీ పురుడు పోశారు. ప్రసవం పూర్తయ్యాక ఆమెను డిశ్చార్జ్ చేశారు. అయితే ఆపరేషన్ జరిగిన కొద్ది రోజులకే ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి మొదలైంది. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణించడంతో ఆమె పలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించింది. షార్దా హాస్పిటల్, గిమ్స్ వంటి ప్రముఖ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకున్నా.. ఎవరూ అసలు కారణాన్ని కనిపెట్ట లేకపోయారు.
ఎనిమిది యూనిట్ల రక్తం.. ప్రాణాపాయ స్థితిలో ఆపరేషన్
నొప్పి భరించలేక ఏప్రిల్ 2025లో ఆమె గ్రేటర్ నోయిడాలోని కైలాష్ ఆసుపత్రిని ఆశ్రయించింది. అక్కడ వైద్యులు ఆమె కడుపులో ఏదో గడ్డలాంటి పదార్థం ఉన్నట్లు గుర్తించి తక్షణమే సర్జరీ చేయాలని సూచించారు. ఏప్రిల్ 22వ తేదీన నిర్వహించిన ఆ ఆపరేషన్లో వైద్యులు షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఆమె కడుపులో ఏకంగా అరమీటర్ పొడవున్న సర్జికల్ గుడ్డ ముక్క ఉందని స్పష్టం చేశారు. 2023లో జరిగిన కాన్పు సమయంలోనే దీనిని డాక్టర్లు కడుపులో వదిలేసినట్లు తేలింది. ఈ రెండో సర్జరీ సమయంలో ఆమెకు ఏకంగా 8 యూనిట్ల రక్తం ఎక్కించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నా.. భవిష్యత్తులో ఆమెకు మళ్లీ సంతానం కలిగే అవకాశం లేదని వైద్యులు చెప్పడం ఆ కుటుంబాన్ని కృంగదీస్తోంది.
ఈ దారుణంపై బాధితురాలి భర్త జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO)కి ఫిర్యాదు చేశారు. అయితే అధికారుల విచారణలో జాప్యం జరిగిందని.. నిందితులకు సహకరించేలా విచారణ సాగిందని బాధితురాలు ఆరోపించారు. అంతేకాకుండా ఆసుపత్రి యాజమాన్యం తమను నోరు విప్పవద్దంటూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరకు బాధితురాలు కోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆదేశాల మేరకు నాలెడ్జ్ పార్క్ పోలీసులు ఆరుగురిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. వీరిలో డాక్టర్ అంజనా అగర్వాల్, డాక్టర్ మనీష్ గోయల్, జిల్లా సీఎంఓ నరేంద్ర కుమార్ సహా పలువురు ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa