ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలింగ్ వేళ జోరుగా బెట్టింగులు.. ప్రధానంగా ఆ స్థానాలపై కోట్లల్లో పందాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 12, 2024, 05:02 PM

దేశమంతా సార్వత్రిక ఎన్నికల హడావుడి నడుస్తోంది. కాగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎన్నికల సమరం కీలక ఘట్టానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లోనే పోలింగ్ నమోదవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలకంటే.. ఎన్నికలు హీటే ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో.. ఏ స్థానంలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అంటూ బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి. ఐపీఎల్ బెట్టింగుల కంటే ఎక్కువ ఎన్నికల బెట్టింగులు నడుస్తున్నట్టు సమాచారం. ఇక ఏపీ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.. కోడి పందాల్లోనే లక్షల్లో బెట్టింగులు పెట్టే ఆంధ్ర జనం ఇప్పుడు ఎన్నికల్లో కోట్లల్లో బెట్టింగులు పెడుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


అయితే.. ప్రధానంగా కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ చేసిన బెట్టింగ్ రాయుళ్లు కోట్ల రూపాయల బెట్టింగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో అయితే.. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో హాట్ హాట్‌గా మారిన హైదరాబాద్ స్థానం మీద పెద్ద ఎత్తున బెట్టింగ్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మల్కాజిగిరి, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ లాంటి సీట్లపై బెట్టింగ్ రాయుళ్లు గట్టిగానే పైసలు పెడుతున్నట్టు సమాచారం. ఇక.. ఏపీలో అయితే.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌, నారా లోకేష్, వైఎస్ షర్మిల వంటి నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై కోట్లలో పందాలు కాస్తున్నట్టు తెలుస్తోంది.


అంతే కాదండోయ్.. కొన్ని ప్రాంతాల్లో అయితే.. క్రికెట్‌లో బాల్ టూ బాల్, రన్ టూ రన్ ఎలా అయితే బెట్టింగ్ పెడతారో.. ఇక్కడ కూడా ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి.. ఎంత మెజార్టీ వస్తుంది.. ఎంత శాతం ఓటింగ్ నమోదవుతుంది అన్న అంశాలపై కూడా గట్టిగానే బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం. అయితే.. పోలింగుకు, ఓట్ల కౌంటింగుకు మధ్య సుమారు 20 రోజుల గ్యాప్ ఉండటంతో.. బెట్టింగ్ రాయుళ్లు మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. వంద రూపాయల బాండ్ పేపర్లపై సంతకాలు చేసి మరీ పందాలు కాస్తున్నారంటే.. దందా ఎలా నడుస్తుందో చెప్పొచ్చు.


కొన్నిచోట్ల ఆన్‌లైన్‌లోనూ బెట్టింగులు నడుస్తుంటే.. మరికొన్ని చోట్ల మాత్రం క్యాష్ టు క్యాష్ నడుస్తోంది. కాగా.. ఇప్పటివరకు వచ్చిన సర్వేల ఫలితాల ఆధారంగా రేషియోలు నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, అక్కడున్న స్థానిన నేతల గెలుపు అవకాశాలను బట్టి ఎప్పటికప్పుడు బెట్టింగ్ సరళి మారిపోతుందని జనాలు చెప్తున్నారు. మొత్తంగా ఏపీ, తెలంగాణలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతాయన్న చర్చ నడుస్తోంది. ఇదే క్రమంలో.. పోలీసులు కూడా గట్టిగానే బందోబస్తు ఏర్పాటు చేశారు. బెట్టింగులు పెట్టే వారిపై డేగకన్ను వేసి ఉంచారు. అయితే.. పోలీసుల కంట పడకుండా గుట్టుగా ఈ దందా నడిపిస్తున్నారు కొందరు బెట్టింగ్ రాయుళ్లు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa