ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలింగ్ వేళ కార్మికులందరికీ తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఉత్తర్వులు కూడా జారీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 13, 2024, 07:33 PM

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఎన్నికల పోలింగుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికకు కూడా పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. జిల్లా కేంద్రాలలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ సెంటర్ల నుంచి ఈవీఎంలు, కంట్రోలింగ్ మిషన్స్, వీవీ ప్యాట్స్‌ను ఎన్నికల సిబ్బంది పోలింగ్ బూత్‌లకు తరలించారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ షురూ కానుంది.


ఇదిలా ఉంటే.. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తోన్న ప్రతి ఒక్క కార్మికుడు ఓటు హక్కు వినియోగించుకోవాలన్న నేపథ్యంలో మే 13వ తేదీన పోలింగ్ రోజును కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ఈ మేరకు సర్కారు ఆదివారం అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు కూడా సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ డే రోజున కచ్చితంగా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. ఒకవేళ ఇవ్వకపోతే.. కఠిన చర్యలు తీసుకోనున్నట్టు హెచ్చరించింది.


కాగా.. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా ప్రైవేటు సంస్థలకు పెయిడ్ హాలిడే ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎవరైనా ఆదేశాలు అనుసరించకుండా సిబ్బందికి సెలవులు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా. పోలింగ్ రోజున.. ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని కంపెనీలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కూడా స్పష్టం చేశారు. పోలింగ్ రోజు సెలవు ఇవ్వని సంస్థలపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో.. ఇప్పటికే మే 13న పెయిడ్ హాలిడేగా అన్ని కంపెనీలు ప్రకటించినట్టు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa