ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండెక్కిన కోడిగుడ్డు ధర.. మరికొన్ని రోజులు తప్పదు, పెరుగుదలకు కారణమిదే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 14, 2024, 07:55 PM

తెలంగాణలో చికెన్ ధరతో పాటు కోడిగుడ్డు ధర కూడా కొండెక్కి కూర్చుంది. ప్రస్తుతం కేజీ చికెన్ రూ. 270- 300 పలుకుతుండగా.. గుడ్డు ధర కూడా విపరీతంగా పెరిగింది. నెల రోజుల వ్యవధిలో ఫాం వద్ద గుడ్డు ధర సుమారు 90 పైసలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. గత నెల ఏప్రిల్‌ 13న గుడ్డు ధర రూ. 4.45 పైసలు ఉండగా.. ప్రస్తుతం రూ.5.35కు చేరింది. రిటైల్‌ మార్కెట్లో చిల్లరగా ఒక్క గుడ్డును రూ.6.50 నుంచి రూ. 7 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. అధిక పోషకాలుండే గుడ్డును నిత్యం ఆహారంలో తీసుకునే చాలా మంది పెరిగిన ధరల కారణంగా గుడ్డును కొనలేని.. తినలేని పరిస్థితి నెలకొంది.


డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతోనే గుడ్డు ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా గుడ్లు పెట్టే లేయర్‌ కోళ్ల మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో మార్కెట్‌లో గుడ్ల కొరత ఏర్పడింది. సాధారణంగానే వేసవిలో లేయర్‌ కోళ్లు వడిగాల్పుల కారణంగా తక్కువ దాణా తీసుకుంటాయి. కొన్ని కోళ్లు ఎండ తీవ్రతకు తట్టుకోలేక మృత్యువాతపడుతుంటాయి. తద్వారా గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ ప్రభావమే ప్రస్తుతం మార్కెట్‌పై పడింది. దీంతో గుడ్ల కొరత ఏర్పడటంతో పాటు ధర పెరిగింది. గుడ్ల ధరలు తగ్గాలంటే మరో రెండు నెలలు ఆగాల్సిందేనని ఫౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. వాతావరణం చల్లబడి లేయర్ కోళ్లు చనిపోకుండా ఉంటే గుడ్ల ఉత్పత్తి పెరుగుతుందని అంటున్నారు. ఆ తర్వాత సప్లయ్ పెరిగి ధరలు అదుపులోకి వస్తాయని అంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa