మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కామెంట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. కౌంటర్ ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణంపై ప్రధాని స్థాయి వ్యక్తి సహించకపోవడం దురదృష్టకరమని పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు. మోదీ తన స్థాయి దిగజారి మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మెట్రోను ఇబ్బందుల్లో పడేస్తున్నారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఈమేరకు ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.
మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయటాన్ని మోదీ జీర్ణించుకోలేక పోతున్నారని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మహిళలు ఆర్థికంగా బలపడాలని కొన్ని రాష్ట్రాలు ఉచిత ప్రయాణం కల్పించడంలో తప్పేముందని ప్రశ్నించారు. వాస్తవానికి ఉచిత బస్సు ప్రయాణానికి మెట్రోకు సంబందం లేదని.. మెట్రో సెక్టార్ ప్రయాణికులు వేరే ఉన్నారని వివరించారు. ఇప్పటికీ మెట్రో ప్రయాణంపై ఇంటర్వ్యూలు చేస్తే బోగీలు పెంచాలని అడుగుతున్నారని.. దాని గురించి ప్రస్తావించకుండా రాజకీయ లబ్ది కోసం ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
మరోవైపు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది ఉండదని పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీనిని ఇంకా కొన్ని రూట్లు, బస్సులు పెంచి ఇంకా సౌకర్యవంతంగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఇక.. మహిళలపై ఆడిపోసుకోవడం మోదీ బంద్ చేయాలని, ఉచితంగా బస్సు ఇచ్చినంత మాత్రాన ఏదో జరిగినట్లు మాట్లాడటం మంచిది కాదని, ఇటువంటి వ్యా్ఖ్యలు చేసి స్థాయి దిగజార్చుకోవద్దని పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మెట్రోను ఇబ్బందుల్లో పడేస్తున్నారని, ఈ నిర్ణయంలో మెట్రో దాదాపు 50 శాతం ప్రయాణికులను కోల్పోతుందని, దీంతో భవిష్యత్తులో మెట్రో నిర్వహణ కష్టతరమయ్యే ప్రమాదం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa