ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 19, 2024, 09:04 PM

సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన మార్కు చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే.. తెలంగాణ సంక్షిప్త పదాన్ని పట్టుబట్టి మరీ.. టీఎస్ నుంచి టీజీ గా మార్చుతూ గెజిట్ కూడా విడుదల చేశారు. త్వరలోనే.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని, అఫీషియల్ లోగోను కూడా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా.. ఇప్పుడు రెండు జిల్లాల పేర్లు కూడా మార్చుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి.. సూచనప్రాయంగా ఓ కీలక ప్రకటన చేశారు.


పరిపాలన సౌలభ్యం కోసం.. పది జిల్లాలతో ఏర్పాడిన తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం 33 జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తెలంగాణ కోసం కొట్లాడిన ప్రముఖుల పేర్లు, చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతాల పేర్లను జిల్లాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నామకరణం చేసింది. ఇందులో భాగంగానే ఆసిఫాబాద్ జిల్లాకు గోండు వీరుడు కొమురం భీం పేరు, కొత్తగూడెం జిల్లాకు పుణ్యక్షేత్రం భద్రాద్రి పేరును, భూపాలపల్లి జిల్లాకు తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ పేరు, గద్వాల జిల్లాకు శక్తిపీఠం జోగులాంబ పేరు, భువనగిరి జిల్లాలకు పుణ్యక్షేత్రం యాదాద్రి పేరు, సిరిసిల్ల జిల్లాకు వేములవాడ రాజన్న పేరును పెట్టారు.


కాగా.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. మరో రెండు జిల్లాల పేర్లను మార్చాలని యోచిస్తోంది. అందులో జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైనా ఒక జిల్లాకు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును పెట్టనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి సూచనాప్రాయంగా చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో రెండు జిల్లాల పేర్లు త్వరలోనే మారుబోతున్నట్టు తెలుస్తోంది.


ఇదిలా ఉంటే.. తెలంగాణలో 33 జిల్లాల ఏర్పాటు ప్రక్రియ హేతుబద్దంగా జరగలేదని ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ ఆరోపిస్తూనే ఉంది. కాగా.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా ఈ మాటను ప్రస్తావించింది. జిల్లాలను ఇష్టామొచ్చినట్టు ఇబ్బడి ముబ్బడిగా, ఏమాత్రం ఆలోచించకుండా.. 33 జిల్లాలుగా విభజించారని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే విమర్శరించటం గమనార్హం. మరి ఇప్పుడు కేవలం పేర్లు మాత్రమే మార్చుతారా లేదా జిల్లాల సరిహద్దులను కూడా మార్చే అవకాశం ఉందా అన్నది చర్చ జరుగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa