ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంచి నీళ్ల కుళాయి పంచాయితీ.. తాతను చంపిన మనవళ్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 20, 2024, 08:47 PM

మంచి నీళ్ల కుళాయి వద్ద తలెత్తిన వివాదం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. గతంలో ఆస్తి తగాదాలు కూడా ఉండటంతో పాతకక్షలు మనుసులో పెట్టుకొని ఓ వృద్ధుడిని సొంత మనవళ్లే దారుణంగా కొట్టి చంపేశారు. ఈ అమానుష ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన జల్లి సారయ్య (80), సమ్మక్క దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా.. చిన్న కుమారుడు చిన్న వయసులోనే చనిపోయాడు.


పెద్ద కుమారుడు రమేశ్‌ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ తొమ్మిదేళ్ల కిందట అకాల మృత్యువు చెందాడు. రమేశ్‌ భార్య రమాదేవి, కుమారులు సాయికృష్ణ, శశికుమార్‌ సారయ్య ఇంట్లోనే ఓ గదిలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే సారయ్యకు రెండెకరాల భూమి ఉంది. ఇటీవల ఆ భూమిలో నాలుగు గుంటలు విక్రయించి.. వచ్చిన డబ్బులు కుమార్తెలకు పంచి ఇచ్చాడు. అప్పట్నుంచి కోడలు, మనవళ్లు సారయ్యతో గొడవపడుతున్నారు. తమకు రావాల్సిన ఆస్తి కుమార్తెలకు కట్టబెడుతున్నారని అప్పటి నుంచి తరచూ గొడవ పెట్టుకునేవారు.


ఈ క్రమంలో ఆదివారం ఉదయం కుళాయి వద్ద నీళ్లు పట్టుకునే విషయంలో సారయ్య-సమ్మక్క దంపతులతో కోడలు రమాదేవి, మనవళ్లు గొడవపడ్డారు. ఘర్షణ పెద్దది కాటవంతో విచక్షణ కోల్పోయిన ఇద్దరు మనవళ్లు వాకింగ్‌ స్టాండ్‌తో తాత సారయ్య తలపై దాడి చేశారు. తల, నుదుటిపై తీవ్రగాయాలతో సారయ్య స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. భార్య సమ్మక్క ఫిర్యాదుతో హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa