ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో 'కొత్త మద్యం బ్రాండ్లు' వస్తున్నాయా?.. మంత్రి జూపల్లి క్లారిటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 07:54 PM

తెలంగాణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకురానుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి మంత్రి జూపల్లి కృష్ణారావు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామనేది పూర్తిగా దుష్ప్రచారమేనని జూపల్లి స్పష్టం చేశారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదని.. అసలు ఆ అంశంపై పరిశీలనే జరగలేదని జూపల్లి చెప్పుకొచ్చారు.


ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మద్యం బ్రాండ్ల కంపెనీలకు డబ్బులు కట్టకుండా.. ఎన్నికల కోడ్ అని చెప్పి కావాలనే మద్యం కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని.. ఇది సాకుగా చూపుతూ కొన్ని కొత్త బ్రాండ్లను పరిచయం చేసేందుకు, వాటి ద్వారా భారీగా కమీషన్ పొందేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే.. ఈ మొత్తం వ్యవహారం వెనుక మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రి తమ్ముడి హస్తం ఉందంటూ కీలక ఆరోపణలు చేస్తున్నారు. కమీషన్ బట్టి తెలంగాణలో కొత్త బ్రాండ్లకు తెరవనున్నారని.. కొన్ని ప్రముఖ బ్రాండ్లు ఇక నుంచి కనిపించవని.. దీని వెనుక సుమారు 5 వేల కోట్ల రూపాయల స్కాం నడుస్తుందంటూ సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ఈ ఆరోపణలపై స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. వాటిని తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నేతల మాటలు దొంగే దొంగ అన్నట్లుగా ఉన్నాయంటూ విమర్శించారు. మద్యం కొరత ఉంటే ప్రభుత్వానికే నష్టమని.. ప్రజలకు కాదని చెప్పుకొచ్చారు. బ్లాకులో మద్యం అమ్మిన ఘటనలపై ఎక్సైజ్‌ శాఖ ఇప్పటికే చాలా కేసులు పెట్టిందని మంత్రి తెలిపారు.


గత ప్రభుత్వం చాలా శాఖల్లో బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని జూపల్లి ఆరోపించారు. రైతు భరోసాకు సంబంధించి రూ.6 వేల కోట్లకు పైగా చెల్లింపులు తమ ప్రభుత్వంలో జరిగాయన్నారు. ఈ నెలలోనే రూ.370 కోట్ల చెల్లింపులు చేశామన్నారు. టానిక్‌లకు గత సర్కార్ ఇచ్చిన పన్ను మినహాయింపులను రద్దు చేశామన్నారు. తయారీ యూనిట్ల వద్ద ఎలాంటి అక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులు నిరంతరం పరిశీలిస్తున్నారని తెలిపారు.


గతంలో పైరవీలు, ముడుపులు ఉంటే తప్ప ఉద్యోగుల బదిలీలు జరిగేవి కావని.. ఇప్పుడు అలాంటివేవీ లేకుండానే పోర్టల్‌ ద్వారా బదిలీలు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాసిన పత్రికపై పరువునష్టం దావా వేస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత ఎక్సైజ్‌శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని జూపల్లి తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa