ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్యం తరలిస్తున్న లారీ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 22, 2024, 08:03 PM

కొన్ని ప్రమాదాలు జనాల్లో మానవత్వం ఉందని నిరూపిస్తే.. ఇంకొన్ని ప్రమాదాలు మాత్రం జనాల్లో దాగున్న కక్కుర్తిని బయటకు తీస్తాయి. అప్పటివరకు ఎంత గౌరవంగా, హుందాగా ఉన్నప్పటికీ.. కొన్ని ప్రమాదాలు మాత్రం వారి స్వార్థపు లక్షణాలను పట్టి బయటకు తీసుకొస్తాయి. ప్రమాదం జరిగినప్పుడు పాపం అని అనే వాళ్లకంటే.. ఆ వాహనంలోని వస్తువులను ఏమాత్రం సిగ్గుపడకుండా ఎత్తుకెళ్లిపోయే ఎక్కువుంటారు. ఎక్కువేంటి.. దాదాపు అందరూ అలాంటివాళ్లే. అచ్చం అలాంటి ప్రమాదమే జరిగింది సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో.


బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని డైరీ ఫార్మ్‌ ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం.. ప్రమాదం జరిగింది. లిక్కర్‌ లోడుతో వెళ్తోన్న లారీ బోల్తా పడింది. టైర్‌ పంక్చర్‌ కావడంతో అదుపుతప్పిన లారీ.. డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో.. దాదాపు రూ.3 లక్షల విలువైన మద్యం బాటిళ్లు ధ్వంసమయ్యాయి. లారీ డోర్‌ తెరుచుకుని.. మద్యం బాటిళ్లన్ని రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.


ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై కుప్పులుగా పడి ఉన్న మద్యం బాటిళ్లను చూసిన వాహనదారులు.. ఎగబడిపోయారు. మద్యం సీసాలు తీసుకునేందుకు పోటీపడ్డారు. దొరికినోళ్లకు దొరికినన్ని అన్నట్టుగా చేతులకు అందినన్ని పట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నించారు. అయితే.. అప్పటికే చాలా వరకు బాటిళ్లు లూటీ అయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa