ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీతి నిజాయితీ ఉన్న ఇలాంటి లీడర్ కావాలి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి మాజీ జేడీ లక్ష్మినారాయణ మద్దతు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 22, 2024, 07:32 PM

తెలంగాణలో ఎన్నికల జాతర ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకు లోక్ సభ ఎన్నికల సందడి నెలకొనగా.. మే 13న పోలింగ్ జరగ్గా.. వాటి ఫలితాలు జూన్ 4న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తెలంగాణలో మే 27వ తేదీన.. నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉపఎన్నికను మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోగా.. నేతలంతా పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో మునిగిపోయారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో నిలవగా.. ఆయన తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రాకేష్ రెడ్డికి.. ఏపీ నేత, జై భారత్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జేడీ లక్ష్మి నారాయణ కూడా తన మద్దతు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు లక్ష్మినారాయణ.


రాజకీయాల్లోకి యువత రావాలని.. అందులోనూ నీతి నిజాయితీ ఉన్న వ్యక్తులు రావాలని తాను కోరుకుంటానని వీవీ లక్ష్మినారాయణ తెలిపారు. ఒక వ్యాపారంలో ఒక వ్యక్తికి నష్టం వస్తే.. అది అతనికి, దానికి సంబంధించిన కొంత మందికి మాత్రమే నష్టం వస్తుందని.. అలాగే ఓ వ్యక్తి అరోగ్యం చెడిపోతే అతనికి మాత్రమే నష్టం చేకూరుస్తుందని.. కానీ రాజకీయాల్లోకి మోసగాళ్లు, స్వార్థపరులు, అవినీతిపరులు వస్తే.. అది మొత్తం సమాజానికే నష్టం జరుగుతుందంటూ చెప్పుకొచ్చారు. అందుకే మనకు కావాల్సింది సమాజం కోసం నిలబడి పని చేసే నాయకులని.. అది కూడా యువతరమే కావాలని వివరించారు.


కాగా.. ఉమ్మడి నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తన మిత్రుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి పోటీ చేస్తున్నాడని.. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి.. బిట్స్ పిలానీ లాంటి సంస్థల్లో చదివి రాకేష్ రెడ్డి గోల్డ్ మెడల్ సంపాదించాడని వివరించారు. అమెరికాలాంటి దేశాలకు వెళ్లే అవకాశం ఉన్నా వదులుకుని.. సమాజ సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాడని తెలిపారు. వరదల సమయంలో, యువతకు ఉద్యోగాల కల్పన కోసం పోరాటంలో ఇలా అనేక సందర్భాల్లో తన వంతు కృషి చేశాడని చెప్పుకొచ్చారు. అలాంటి రాకేష్ రెడ్డి ఈ పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడ్డాడని తెలిసి చాలా సంతోషించానని తెలిపారు. అందుకే.. మొదటి ప్రాధాన్యత ఓటుగా రాకేష్ రెడ్డికి వేసి.. అఖండ మేజార్టీతో గెలిపించి.. మనల్ని మనం గెలిపించుకోవాలని వీవీ లక్ష్మినారాయణ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa