ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్రిజ్‌లో అసలు పెట్టకూడని ఫుడ్స్ ఇవే

Life style |  Suryaa Desk  | Published : Sun, Jan 11, 2026, 09:12 PM

నేటి కాలంలో ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్ అనేది ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలు, పండ్లు పాడవకుండా ఉండటానికి మనం వెంటనే వాటిని ఫ్రిజ్‌లో భద్రపరుస్తుంటాం. అయితే మనం చేసే ఈ చిన్న పొరపాటు వల్ల ఆ ఆహార పదార్థాల్లోని పోషకాలు నశించడమే కాకుండా అవి విషతుల్యంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ మనోజ్ఞ సోషల్ మీడియా వేదికగా ఏయే ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదో చెప్పుకొచ్చారు. కొన్ని రకాల ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల కలిగే నష్టాలను ఆమె వివరించారు.


ఉల్లిపాయలు పెట్టొద్దు


చాలామంది ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల ఫ్రిజ్‌లోని తేమను ఉల్లిపాయలు పీల్చుకుంటాయి. దీనివల్ల అవి మెత్తబడిపోయి త్వరగా బూజు పడతాయి. ఉల్లిపాయలను ఎప్పుడూ గాలి తగిలే పొడి ప్రదేశంలోనే ఉంచాలి.


వంకాయలు కూడా వద్దు


వంకాయలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల వాటి సహజ సిద్ధమైన రంగు మారిపోతుంది. లోపల విత్తనాలు గట్టిపడటంతో పాటు పైన ముడతలు పడుతుంది. వీటి రుచి కూడా మారిపోతుంది.


అవకాడో  రుచి పోతుంది


అవకాడోలు పూర్తిగా పక్వానికి రావాలంటే గది ఉష్ణోగ్రత వద్దే ఉండాలి. వీటిని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఆ ప్రక్రియ ఆగిపోతుంది. లోపల గుజ్జు సరిగ్గా మెత్తబడక రుచి పచి లేకుండా పోతుంది.


అరటిపండ్లు నల్లగా మారతాయ్


అరటిపండ్లను ఫ్రిజ్‌లో పెడితే నల్లగా మారిపోతాయి. ఫ్రిజ్‌లోని చల్లదనం అరటిపండు తొక్కలోని కణాలను దెబ్బతీస్తుంది. తద్వారా లోపల పండు కుళ్ళిపోయినట్లుగా కనిపిస్తుంది.


టమోటాలు కూడా వద్దు


​టమోటాలను ఫ్రిజ్‌లో పెడితే వాటి సహజ సిద్ధమైన సువాసన, రుచి నశిస్తాయని డాక్టర్ మనోజ్ఞ తన వీడియోలో చెప్పారు. చల్లని ఉష్ణోగ్రత టమోటాలోని పొరలను దెబ్బతీసి వాటిని చప్పగా మారుస్తుంది.


బంగాళాదుంపలు అసలే వద్దు


బంగాళాదుంపలు/ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో ఉంచడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. చల్లదనం వల్ల దుంపల్లోని పిండి పదార్థం చక్కెరగా మారుతుంది. వీటిని వండినప్పుడు చక్కెర స్థాయిలు పెరుగుతాయి.


బొప్పాయి పాడవుతుంది


బొప్పాయి పండును ఫ్రిజ్‌లో పెడితే అది చాలా వేగంగా పాడైపోతుంది. తక్కువ ఉష్ణోగ్రత వద్ద బొప్పాయిలోని ఎంజైమ్‌లు దెబ్బతింటాయి. పండు మెత్తబడిపోయి తినడానికి పనికిరాకుండా పోతుంది.


కీరా దోసకాయ కూడా వద్దు


దోసకాయలకు చల్లదనం పనికిరాదు. వీటిని ఫ్రిజ్‌లో పెడితే పైన చర్మం వాడిపోయి లోపల నీరంతా ఆవిరైపోతుంది. త్వరగా ఎండిపోయి రుచి కోల్పోతాయి.


ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. ఆ ఆహారాన్ని సరైన పద్ధతిలో భద్రపరచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ ఎనిమిది వస్తువులను బయట గాలి తగిలే ప్రదేశంలో ఉంచడం ద్వారా వాటి పోషకాలను, రుచిని కాపాడుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa