ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జియో నుంచి 'పీపుల్-ఫస్ట్' ఏఐ ప్లాట్‌ఫామ్‌ రాబోతోందని ముఖేశ్ అంబానీ ప్రకటన

business |  Suryaa Desk  | Published : Mon, Jan 12, 2026, 06:06 AM

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  రంగంలో సంచలన ప్రకటన చేశారు. జియో త్వరలోనే ఒక 'పీపుల్-ఫస్ట్'  ఏఐ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భారత్‌లో భారత్ కోసం ప్రపంచం కోసం దీనిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఆదివారం జరిగిన వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.ఈ కొత్త ప్లాట్‌ఫాం ద్వారా దేశంలోని ప్రతి పౌరుడు, గుజరాత్ నుంచి మొదలుపెట్టి, తమ సొంత భాషలో తమ సొంత డివైజ్‌పై ఏఐ సేవలను సులభంగా వినియోగించుకోవచ్చని అంబానీ వివరించారు. దీనివల్ల ప్రజల సామర్థ్యం ఉత్పాదకత గణనీయంగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గుజరాత్‌ను భారతదేశంలో ఏఐ రంగంలో అగ్రగామిగా నిలబెడతామని ఆయన ప్రతిజ్ఞ చేశారు.ఈ లక్ష్య సాధన కోసం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ జామ్‌నగర్‌లో మనం భారతదేశంలోనే అతిపెద్ద ఏఐ-రెడీ డేటా సెంటర్ నిర్మిస్తున్నాం. దీని ఏకైక లక్ష్యం  ప్రతి భారతీయుడికి సరసమైన ఏఐ అందుబాటులో ఉంచడం అని అంబానీ స్పష్టం చేశారు.ఈ ఏఐ ప్లాట్‌ఫాం ప్రకటనతో పాటు, గుజరాత్ అభివృద్ధికి రిలయన్స్ కట్టుబడి ఉందని తెలుపుతూ మరో నాలుగు ప్రధాన హామీలను కూడా ఆయన ప్రకటించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.3.5 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టిన రిలయన్స్, రానున్న ఐదేళ్లలో దానిని రెట్టింపు చేసి రూ.7 లక్షల కోట్లకు పెంచుతుందని తెలిపారు. జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ ఎకోసిస్టమ్ ఏర్పాటు, కచ్ ప్రాంతాన్ని గ్లోబల్ క్లీన్ ఎనర్జీ హబ్‌గా మార్చడం, 2036 ఒలింపిక్స్‌ను అహ్మదాబాద్‌కు తీసుకురావడంలో ప్రభుత్వానికి సహకరించడం వంటివి ఈ హామీలలో ఉన్నాయి.ఈ సందర్భంగా ప్రధాని మోదీ దార్శనికతను ప్రశంసిస్తూ, "స్వాతంత్ర్య భారత చరిత్రలో ఇప్పుడున్నంత ఆశ, ఆత్మవిశ్వాసం ఎన్నడూ లేదు" అని పేర్కొన్నారు. గుజరాత్ తమకు కేవలం ఒక ప్రాంతం కాదని, "మా శరీరం, హృదయం, ఆత్మ" అని, "మాది గుజరాతీ కంపెనీ" అని ఆయన భావోద్వేగంగా అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa