ఏపీ రాజధాని అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు అంశం రాజకీయంగా చర్చకు కారణమవుతోంది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు గురించి బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు, మెమొరియల్ పార్క్ అభివృద్ధి పేరుతో ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని బోడె రామచంద్ర యాదవ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న రామచంద్రయాదవ్.. ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు, మాజీ ఉద్యోగులకు పింఛన్లు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ఇంత దారుణమైన పరిస్థితిలో, ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును కాంస్య విగ్రహాల రూపంలో కరిగించడానికి ప్రయత్నించడం ప్రభుత్వ ప్రాధాన్యాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తోందన్నారు.
ఒకవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కోత విధిస్తున్నారని.. మరోవైపు అభివృద్ధి పనులకు డబ్బులు లేవని ప్రభుత్వం చెప్తోందన్నారు. ఇలాంటి పరిస్థితులలో 3500 టన్నుల కాంస్య విగ్రహాన్ని 1800 కోట్లు ఖర్చుచేసి ఏర్పాటు చేయాలని అనుకోవడం పాలనాపరమైన అవివేకమని విమర్శించారు. ప్రజలు పన్నులు చెల్లించడం ద్వారా వచ్చే ఆదాయం, ప్రభుత్వం తీసుకునే రుణాలను.. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించాలన్న రామచంద్ర యాదవ్.. రాజకీయ ప్రయోజనాలకు, రాజకీయ నేతల విగ్రహాలకు కాదని అన్నారు.
మీకు ఎన్టీఆర్ అంటే నిజంగా ప్రేమ, గౌరవం ఉంటే.. మీ సొంత డబ్బులతో లేదా మీ పార్టీకి విరాళాల రూపంలో వచ్చిన సొమ్ముతో ఏర్పాటు చేయించాలన్నారు. అలా చేస్తే ఎవరూ అభ్యంతరం తెలియజేయవని.. ఇలాంటి విగ్రహాలను ప్రభుత్వ ధనం రూపాయి కూడా ఉపయోగించడానికి లేదన్నారు.
పేదవాడి ఆకలి తీర్చడమే నిజమైన తెలుగోడి గర్వం.. యువతకు ఉపాధి కల్పించడమే తెలుగు వైభవమని రామచంద్రయాదవ్ అన్నారు. గ్రంథాలయాలను అభివృద్ధి చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలు, రీసెర్చి సౌకర్యాల మెరుగుదలను చేపట్టాలని సూచించారు. ఇలా కాదని విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేసినా.. ప్రజాధనంతో ఏ విగ్రహం కూడా ఏర్పాటు చేయకుండా బీసీవై పార్టీ ఉద్యమం చేపడుతుందని రామచంద్రయాదవ్ హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa