తెలంగాణలో ఎన్నికల జాతర ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్నే లోక్ సభ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ముగియగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మధ్యలోనే.. మే 27న ఉమ్మడి ఖమ్మం- వరంగల్- నల్గొండ జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. అయితే.. ఈ ఎన్నికల సందర్భంగా ఆ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎన్నికల సంఘం సెలవు ప్రకటించి గుడ్ న్యూస్ వినిపించింది. పట్టభద్రులైన ఉద్యోగులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది.
ఎన్నికల సంఘం ప్రకటించిన ఈ నిర్ణయంతో నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, సిద్దిపేట మొత్తంగా 12 జిల్లాల్లోని పట్టభద్రులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సెలవు లభించనుంది. అయితే.. ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం సెలవు ఇచ్చేందుకు ఈసీ నుంచి ఎలాంటి నిబందనలు లేవని సీఈఓ ఆఫీస్ వివరించింది. అయితే.. ఓటు వేసేందుకు వీలుగా... ఆ 12 జిల్లాలకు చెందిన ఉద్యోగులకు పని గంటల్లో వెసులుబాటు కల్పించటమో, స్పెషల్ పర్మిషన్ లాంటివి ఇవ్వాలని ప్రైవేట్ కంపెనీ యాజమాన్యాలకు సీఈఓ ఆఫీస్ సూచించింది.
ఇదిలా ఉంటే.. ఈ పట్టభద్రుల నియోజకవర్గం ఉమ్మడి వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో.. ప్రస్తుతమున్న 12 జిల్లాల్లో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో 2,87,007 మంది పురుషులు కాగా, 1,74,794 మంది మహిళలు, ఇతరులు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తంగా 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa